అమెరికాలో అబార్షన్ హక్కులకు మంగళం!

అమెరికాలో అబార్షన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. అబార్షన్‌ నిషేధించే విషయంలో రాష్ట్రాలే ఇక నిర్ణయం తీసుకోవచ్చునని పేర్కొంది. దీంతో అబార్షన్‌ చేయించుకునేందుకు వీలుగా మహిళలకు దాదాపు 50 ఏళ్లుగా అందుబాటులో ఉన్న రాజ్యాంగపరమైన హక్కులకు ముగింపు పలికినట్లయింది. 
దాదాపు 50ఏళ్ల కిందట రో వర్సెస్ వేడ్ కేసులో మహిళలకు అబార్షన్ హక్కును అనుమతిస్తూ వెలువడిని చారిత్రాత్మక తీర్పును సుప్రీం కొట్టివేసింది. దీనికి సంబంధించి ఒక అధికార పత్రం లీక్ అవడంతో ఆలస్యంగా ఈ నిర్ణయం వెలుగుచూసింది. ఇక ఈ తీర్పు అమెరికాలో అబార్షన్ హక్కులను పూర్తిగా మార్చేయనుంది.
అమెరికాలో 1973లో రో వర్సెస్ వేడ్ కేసులో మహిళలు అబార్షన్ కు చట్టబద్ధత కల్పిస్తూ తీర్పు వెలువడింది. అప్పటినుండి అక్కడ అబార్షన్లు చట్టబద్ధమయ్యాయి.అయితే నియంత్రణ లేని అబార్షన్లు మహిళల అబార్షన్లపై ప్రభావం చూపుతాయని..అబార్షన్లకు చట్టబద్దత రద్దుచేయాలని అమెరికాలోని కొందరు కొంతకాలం నుండి పోరాడుతున్నారు.
‘‘గర్భస్రావం చేసే హక్కును రాజ్యాంగం ఇవ్వలేదని మేం భావిస్తున్నాం. అబార్షన్లను నియంత్రించే హక్కు ప్రజాప్రతినిధులు, ప్రజలకు తిరిగి దక్కుతుంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.  దీనితో దేశవ్యాప్తంగా దాదాపు 25 రాష్ట్రాలు అబార్షన్‌పౖౖె త్వరలోనే నిషేధాజ్ఞలు విధించే అవకాశాలున్నాయి.
5-3 మెజార్టీతో వెలువడిన ఈ తీర్పుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ ఇది అమెరికాకు విచారకరమైన రోజు. అబార్షన్ కు చట్టబద్ధత తొలగించడంతో ఎంతో మహిళల ఆరోగ్యం,జీవితం ప్రమాదంలో పడింది. మహిళల హక్కులను కాపాడేందుకు నా అధికారులను ఉపయోగిస్తూ అవసరమైన కృషి చేస్తాను’’ అని బైడెన్ హామీ ఇచ్చారు. 
 
ఒక మహిళ, ఆమె డాక్టర్‌ తీసుకునే నిర్ణయంలో రాజకీయ నాయకుల జోక్యం ఎంతమాత్రమూ జోక్యం తగదని ఆయన స్పష్టం చేశారు. సుప్రీం తీర్పుపై మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా విమర్శలు గుప్పించారు. అమెరికన్ల స్వేచ్ఛపై దాడిగా దాన్ని పేర్కొన్నారు. మరో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం దీనిపై హర్షం వ్యక్తం చేశారు. 
 
ట్రంప్‌ హయాంలో నియమితులైన ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్‌ నీల్‌ గొర్సుచ్‌, జస్టిస్‌ బ్రెట్‌ కావనాగ్‌, జస్టిస్‌ అమీ కొనే బారెట్‌ అబార్షన్‌ హక్కులకు మంగళం పాడేందుకు మద్దతు పలికారు. గర్భవిచ్ఛిత్తికి సంబంధించి అమెరికాలో ఇటీవల ఒపీనియన్‌ పోల్స్‌ నిర్వహించగా మెజార్టీ పౌరులు మహిళలకు ఆ విషయంలో పూర్తి హక్కులు ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. 
కాగా ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఎంతో మంది సుప్రీంకోర్టు ఎదుట నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికే ముప్పుందని అంచనాలు వెలువడుతున్నాయి.