గుజరాత్ అల్లరిలో మోదీకి `సుప్రీం’ క్లీన్ చిట్!

గుజరాత్ లో 2002లో జరిగిన అల్లర్లలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో పాటు మరో 63 మందిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్ చిట్‌ ఇవ్వడాన్ని సమర్ధించింది. నాడు హత్యకు గురైన కాంగ్రెస్ నేత ఎహ్సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. 

2012లో సిట్ దాఖలు చేసిన మూసివేత నివేదికకు వ్యతిరేకంగా జకియా జాఫ్రీ దాఖలు చేసిన నిరసన పిటిషన్‌ను తిరస్కరిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులను జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సమర్థించింది. న్యాయమూర్తులు దినేష్ మహేశ్వరి, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆమె పిటిషన్‌లో ఎలాంటి అర్హత లేదని పేర్కొంది.

2002 గుజరాత్ అల్లర్లలో పెద్ద కుట్ర జరిగిందని ఆమె ఆరోపించారు. గోద్రా రైలు దహనం తర్వాత ఫిబ్రవరి 28, 2002న జరిగిన హింసాకాండలో అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీలో మరణించిన 68 మందిలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ కూడా ఉన్నారు.

2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ సహా 64 మందికి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని జకియా జాఫ్రీ సవాలు చేశారు. సిట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమె వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ 2017 అక్టోబర్ 5న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను, ఆమె పిటిషన్ సవాల్ చేసింది.

ఈ పిటిషన్‌పై గత ఏడాది డిసెంబర్ 9న సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.2002 గుజరాత్ అల్లర్లలో నిర్వహించిన దర్యాప్తు విషయంలో జకియా జాఫ్రీ పిటిషన్ మినహా ఎవరూ “వేలు ఎత్తలేదు” అని సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా సిట్ పేర్కొంది.

ఫిబ్రవరి 27, 2002న గోద్రా వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-6 కోచ్‌ని తగులబెట్టడంతో 59 మంది మరణించారు. అది రాష్ట్రంలో అల్లర్లకు దారితీసింది. ఫిబ్రవరి 8, 2012న, సిట్ ఇప్పటి ప్రధాని మోదీ, సీనియర్ ప్రభుత్వ అధికారులతో సహా 63 మందికి వ్యతిరేకంగా “ప్రాసిక్యూటబుల్ సాక్ష్యాలు” లేవని పేర్కొంటూ వారికి క్లీన్ చిట్ ఇస్తూ,  మూసివేత నివేదికను దాఖలు చేసింది.