సిద్ధాంతాలను బలి పెడితే అధికారం మూన్నాళ్ల ముచ్చటే

సిద్ధాంతాలను బలిపెట్టి, అధికారం కోసం అర్రులు చాస్తే అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగులుతుందని ‘మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం రుజువు చేసిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. లోక కల్యాణానికి మూలమైన హిందూ ధర్మాన్ని నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో ఉద్ధవ్ తాకేరే తండ్రి బాల్ థాకరే  శివసేన పార్టీ స్థాపించారని ఆమె గుర్తు చేశారు. 
మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న శివసేన పార్టీలో చోటు చేసుకున్న తిరుగుబాటు పరిణామం ఎంతమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదని ఆమె చెప్పారు. సీఎం ఉద్ధవ్ నాయకత్వంలోని శివసేనలో రెబెల్ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.
పొత్తులు, సంకీర్ణ సర్కార్లపై బాల్ థాక్రే  గతంలో స్పందిస్తూ ఏ పార్టీకి మెజారిటీ ఉందో ఆ పార్టీ మాత్రమే సంకీర్ణ సర్కార్‌కు నేతృత్వం వహించాలని చెప్పారని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. ఉద్ధవ్ ఇవన్నీ తుంగలో తొక్కి, కేవలం అధికారం కోసం తండ్రి వ్యతిరేకించిన పార్టీలతోనే చేతులు కలిపి శివసేనని మలినం చేశారని ఆమె ధ్వజమెత్తారు.
చిరకాల మిత్రుడిగా ఉంటూ వచ్చిన బీజేపీని దూరం చేసుకున్నారని,  చివరికిప్పుడు సొంత పార్టీవారే తిరుగుబాటు చెయ్యగా… దిక్కులేక సీఎం పీఠాన్ని వదులుకునేందుకు సిద్ధపడాల్సి వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు.  ఉద్ధవ్‌కి ఇంతకంటే అవమానం మరొకటి ఉండదని ఆమె స్పష్టం చేశారు.
కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ఉండటం ఎంత ప్రమాదకరమో చివరికి ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు గ్రహించినా ఉద్ధవ్ మేలుకోకపోవడం ఈ పరిస్థితులకి దారితీసిందని ఆమె తెలిపారు.