సంక్షోభంలో శివసేన ప్రభుత్వం… 22 మంది ఎమ్యెల్యేలు వేరే కుంపటి!

మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన అసంతృప్త నేత ఏక్‌నాథ్ షిండే తనతో పాటు 22 మంది  మొత్తం 12 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గుజరాత్‌ కు మకాం మార్చారు. సూరత్‌ నగరంలోని ఓ హోటల్‌లో క్యాంప్ ఏర్పాటు చేశారు. ఏక్‌నాథ్ షిండేతోపాటు మిగతా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్లు కలవడంలేదని సమాచారం.
దీంతో ఉద్ధవ్ ఠాక్రే  ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉంటున్నారు. పార్టీ అధిష్ఠానం తనను పట్టించుకోవడం లేదని, పక్కనపెడుతున్నారని షిండే భావిస్తున్నట్టు కధనాలు వెలువడుతున్నాయి.
ఆయనతోపాటు పల్ఘర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగా, అలీగర్ ఎమ్మెల్యే మహేంద్ర డల్వీ, భివండి రూరల్ ఎమ్మెల్యే శాంతారామ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేల ఫోన్లు ‘అన్‌రీచ్‌బుల్’ అని వస్తున్నాయి. ఈ పరిణామంపై ఎన్‌సీపీ  ప్రతినిధి మహేష్ తపసే మాట్లాడుతూ  మహాకూటమి ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని, ఖచ్చితంగా భద్రంగా ఉందని భరోసా వ్యక్తం చేశారు.
కాగా ప్రతిపక్ష బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. శివసేనకు చెందిన 12 ఎమ్మెల్యేలతోపాటు 5 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై మాజీ శివసేన నేత, ప్రస్తుతం బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రి  నారాయణ్ రాణె స్పందిస్తూ కారణం ఏంటో తెలియకుండా ఇలాంటి అంశాలపై వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.
మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార మహాకూటమి, విపక్ష బీజేపీ చెరో 5 సీట్లు గెలుచుకున్న గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ పోటీ చేసిన 5 చోట్లా విజయం సాధించింది. కాగా కాంగ్రెస్ నేత, దళిత నాయకుడు చంద్రకాంత్ హండోర్ ఓటమి పాలవ్వడం అధికార కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఏక్‌నాథ్ షిండే మధ్యాహ్నం మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. పరిస్థితులు చూస్తుంటే అధికారి శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) పార్టీకి ఇబ్బందులు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.
శివసేనకు చెందిన ప్రముఖ నేతల్లో ఒకరైన ఏక్‌నాథ్ షిండే పార్టీ విస్తరణలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ పబ్లిక్ వర్క్స్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన కొడుకు డాక్టర్ శ్రీకాంత్ షిండే ప్రస్తుతం కల్యాన్ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు.