దృఢమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా ఆసియాన్

అర్ధవంతమైన, దృఢమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా కృషి చేయాలని ఆసియాన్, భారత్‌ నిర్ణయించాయి. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా వాణిజ్యం, ప్రాంతీయ భద్రతకు సంబంధించి తలెత్తిన ఇబ్బందుల పరిష్కారానికి అన్వేషించాలని అంగీకరించాయి.  గురువారం ఢిల్లీలో జరిగిన ఆసియాన్‌ విదేశాంగ మంత్రుల భేటీలో విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రారంభోపన్యాసం చేశారు.
యుద్ధం ప్రభావం ఆహారం, ఇంధన భద్రత, వినియోగ వస్తువులు, ఎరువుల ధరల పెరుగుదలతోపాటు రవాణా, సరఫరా గొలుసులపై పడిందని తెలిపారు.  వాణిజ్యం, అనుసంధానత, రక్షణ, టీకా ఉత్పత్తి, ఇంధనం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని భారత్‌– ఆసియాన్‌ తీర్మానించాయి. ఆసియాన్‌–భారత్‌ ట్రేడ్‌ ఇన్‌ గూడ్స్‌ అగ్రిమెంట్‌ (ఏఐటీఐజీఏ)పై సమీక్ష జరపాలని నిర్ణయించాయి.
10 దేశాలతో కూడిన ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ఆసియాన్‌)తో సంబంధాలకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా   భారత్‌ రెండు రోజుల సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో పాల్గనేందుకుఆసియాన్‌ దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు.  సింగపూర్, బ్రూనై, ఇండోనేసియా, కాంబోడియా, మలేసియా, వియత్నాం దేశాల విదేశాంగ మంత్రులు వారు ప్రధాని నరేంద్ర మోదీతోనూ సమావేశమై భారత్‌, ఆసియాన్‌ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై నేతలు చర్చించారు.
 ఆసియాన్‌ మంత్రులు, ప్రతినిధులతో సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ కూడా పాల్గొన్నారు.  “భారత్‌-ఆసియాన్‌ సుేహబంధంలో ఇదొక మైలురాయి, ఈ ప్రత్యేక సదస్సుకుభారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. మా వ్యూహాత్మక భాగస్వామ్యానికి పదేళ్ళు, సంబంధాలు నెలకొని 30ఏళ్ళు.” అని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్‌ బగ్చి ట్వీట్‌ చేశారు.
1992లో మొదలైన సంబంధాలు 2012లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి చేరాయి. ఆగుేయాసియా దేశాల సమాఖ్య (ఆసియాన్‌)ను ఈ ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన గ్రూపుల్లో ఒకటిగా భావిస్తారు. తూర్పు దేశాల పట్ల భారత్‌ విధానానికి, విస్తృత ఇండో పసిఫిక్‌ దార్శనికతకు ఆసియాన్‌ కీలకంగా వుంది.