4న మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రారంభించ‌నున్న మోదీ

నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో ఆరు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేసిన్నట్లు తెలుపుతూ ఏపీలో మంగళగిరి వద్ద ఏర్పాటు ఎయిమ్స్ ను ప్రధాని మోదీ జులై 4న ప్రారంభించనున్నట్లు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే తెలిపారు.  ఇక్కడ ఎయిమ్స్‌లో ఒక ఏడాది నుంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. 
 
దేశంలో సూపర్‌ స్పెషాలిటీ- వైద్యం ఏ విధంగా అందుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు ఆమె అనంతపురంలో సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ సందర్శన  సందర్భంగా తెలిపారు. ఎపిలో  తమ పార్టీ  అధికారంలో లేకున్నా కూడా ఎయిమ్స్‌ ఏర్పాటు చేశామని ఆమె గుర్తు చేశారు. 
 
ఈ సందర్భంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలోని గ్రౌండ్‌ ఫ్లోర్ లో ఎక్స్‌ రే, ఆల్ట్రా సౌండ్‌, కన్సోల్‌ గదిని, మొదటి అంతస్తులో ఐసీయూ కాంప్లెక్స్‌, రెండవ అంతస్తులో నాడీ శస్త్రచికిత్స ఐపీ వార్డు, తదితర విభాగాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. దేశంలో ఎన్నో రకాల వ్యాధులు ప్రబలుతున్నాయని, వాటికి అవసరమైన మందులు, ఇంజెక్షన్లు ఇతర దేశాల నుంచి మాత్రమే మన దేశానికి అందేవని ఆమె పేర్కొన్నారు.
అయితే తొలిసారిగా దేశ ప్రధాని మోదీ  నేతృత్వంలో మన శాస్త్రవేత్తలు మనదేశంలోనే కేవలం 11 నెలల వ్యవధిలోనే కరోనా వ్యాక్సిన్‌ ను తయారు చేశారని కొనియాడారు. ఇలాంటివి గతంలో ఎన్నడూ జరగలేదని, బయట దేశాల నుంచే వ్యాక్సిన్లు పొందేవారమని ఆమె పేర్కొన్నారు.
ఏ రకమైన వ్యాధుల కైనా ఒకటి నుంచి రెండు సంవత్సరాల తర్వాతే మందులన్నీ భారత్‌కు వచ్చేవని,  అలాంటి స్థితి నుంచి ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్‌ ను ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం నేడు ఎదిగిందని కేంద్ర మంత్రి తెలిపారు.  కరోనా సమయంలో పారాసిటమోల్‌ మాత్రలు కూడా అమెరికాలో లేవని, మన దేశం నుంచి పారాసిటమోల్‌ మాత్రలు ఇతర దేశాలకు సరఫరా చేశామని ఆమె గుర్తు చేశారు.
 అంతేకాక దేశం నుంచి పళ్ళు, పాలతోపాటు, పుష్పాల్లాంటి నిత్యావసర సరుకులు కూడా ఇతర దేశాలకు అందించామని ఆమె చెప్పారు.  అలాగే మందులతోపాటు  వెంటిలేటర్‌ లను కూడా ఇతర దేశాలకు సరఫరా చేశామని తెలిపారు. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరికి అందిందని పేర్కొంటూ  ఉచితంగా 180 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ప్రజలకు అందించామని ఆమె వివరించారు.
ఇందులో మొదటి డోసు 97 శాతం, రెండవ డోసు 87 శాతం, బూస్టర్‌ డోస్‌ 20 కోట్లు అందించామని కేంద్ర మంత్రి తెలిపారు. ఎక్కువ శాతం దేశంలో కరోనా వ్యాక్సిన్‌ అందజేయడంతో ఇతర దేశాలతో బేరీజు వేసుకుంటే భారత దేశంలో కరోనా మరణాలు తక్కువగా నమోదయ్యాయని ఆమె చెప్పారు.
 గత ఏడాది కరోనా వ్యాక్సిన్‌, రీసెర్చ్‌ ల కోసం రూ 35 వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌ లో కేటాయించామని ఆమె గుర్తు చేశారు.  ఆత్మ నిర్బర్‌ భారత్‌ దిశగా మన దేశం నిలిచిందని చెబుతూ  వైద్య శాఖలో డాక్టర్లు, నర్సులు, టె-క్నీషియన్లు, పారామెడికల్‌ సిబ్బందిని ప్రతి జిల్లాలో ఎంత అవసరమో అంత మేరకు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తోడ్పాటు  అందించాలని ఆమె కోరారు.