దేశంలో పట్టాలెక్కిన తొలి ప్రైవేట్ రైల్ 

 
దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రైలు సర్వీస్‌ ప్రారంభమైంది. ‘భారత్‌ గౌరవ్‌’ పేరు తో ప్రైవేటు రైళ్లను నడుపనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు తొలి ప్రైవేటు రైలు తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్‌ నుంచి మహారాష్ట్రలోని షిరిడీ సాయినగర్‌కు మంగళవారం సాయంత్రం 6 గంటలకు బ యల్దేరింది. 
 
దక్షణ రైల్వే సేలం డివిజనల్ మేనేజర్ గౌతమ్ శ్రీనివాస్ జెండా ఊపడంతో రైలు బయలుదేరింది. ఈ రైలును సౌత్ స్టార్ రైల్ అనే ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తున్నది. సంవత్సరానికి రూ 3.34 కోట్ల ఆదాయం సమకూరుస్తుంది. రైల్వే భోగీలకు మన సాంస్కృతిక విలువలు ప్రతిబింబించే  విధంగా లోపల అలంకారాలు జరిపారు. 
 
దీంతో దేశంలోనే తొలి ప్రైవేటు రైలు సర్వీసును ప్రారంభించిన ఘనత దక్షిణ రైల్వేకి దక్కింది. 20 బోగీలు కలిగిన ఈ రైలును సేలం డివిజన్‌ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ గౌతమ్‌ శ్రీనివాస్‌ ప్రారంభించారు. తొలి రోజే ఈ రైలులో 1,100 మంది ప్రయాణించారు. ఈ ప్రైవేటు రైలు గురువారం ఉదయం 7.25 గంటలకు షిరిడీ చేరుతుంది. 
 
తిరుప్పూరు, ఈరోడ్‌, సేలం, యెలహంక, ధర్మవరం, మంత్రాలయం స్టేషన్లలో ఆగనుంది. షిరిడి చేరుకున్నాక ప్రయాణికులకు బస్సు సదుపాయం, సాయి దేవాలయ దర్శనం తదితర ఏర్పాట్లను కూడా కల్పిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు మంత్రాలయం వద్ద 5 గంటలు ఆగుతుంది. ఆ సమయంలో భక్తులు మంత్రాలయం దర్శనం చేసుకుని రావచ్చు. 
 
ప్రయాణీకులు అందరికి అల్పాహారం, భోజనం వంటి సదుపాయాలతో పాటు పడకకు దుప్పట్లు, భక్తి సంబంధ పత్రికలు కూడా అందజేస్తారు.