5జి స్పెక్ట్రమ్‌ వేలంకు కేంద్రం ఆమోదం

5జి నెట్‌వర్క్‌లను ఆపరేట్‌ చేయడానికి ప్రైవేట్‌ సంస్థలకు కేంద్రం మార్గం సుగమం చేసింది. ప్రైవేట్‌ సంస్థలకు నేరుగా రేడియో వేవ్‌లను కేటాయించే ప్రతిపాదనకు భారత ప్రభుత్వం బుధవారం తుది ఆమోదం తెలిపింది. 
 
ప్రధాని నరేంద్ర మోదీ  అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం స్పెక్ట్రమ్‌ వేలాన్ని నిర్వహించాలన్న టెలికమ్యూనికేషన్ల శాఖ ప్రతిపాదనను ఆమోదించింది. ప్రజలకు, సంస్థలకు 5జి సేవలను అందించడానికి ఈ వేలంలో గెలుచుకున్న బిడ్డర్లకు స్పెక్ట్రమ్‌ కేటాయించనున్నట్లు తెలిపింది. 
 
టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్ల వ్యాపార వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం జూలై చివరి నాటికి 20 సంవత్సరాల చెల్లుబాటుతో మొత్తం 72097.85 ఎంహెచ్‌జెడ్‌ స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. జులై నెలాఖరులోగా 5జి స్పెక్ట్రమ్‌ వేలాన్ని నిర్వహిస్తామని పేర్కొంది.  
 
దేశంలోనే మూడు ప్రధాన సంస్థలు వొడాఫోన్‌ ఐడియా, భారతి ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ ఇండస్టీస్‌ లిమిటెడ్‌కి చెందిన జియోలు ఈ వేలంలో పాల్గనవచ్చని భావిస్తున్నాయి. ఎయిర్‌వేవ్‌ల కోసం ముందస్తు చెల్లింపును కూడా రద్దు చేసింది. 
 
 5జి స్పెక్ట్రమ్‌కు బిడ్డర్లు 20 సమానమైన నెలవారీ వాయిదా (ఇఎంఐ)లలో చెల్లించవచ్చని పేర్కొంది. అయితే ప్రతి వాయిదాను సంవత్సరం ఆరంభంలోనే చెల్లించాలని ఆ ప్రకటనలో తెలిపింది. ఇక, బిడ్డరు 10 ఏళ్ల తర్వాత స్పెక్ట్రమ్‌ను తిరిగి ఇచ్చే అవకాశం కూడా కల్పించింది. 
 
అప్పుడు బ్యాలెన్స్‌ ఇన్‌స్టాల్‌మెంట్లను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వేలం ధర ఎంతన్నది మాత్రం ప్రస్తుతానికి వెల్లడించలేదు. త్వరలో అందుబాటులోకి రానున్న 5జి సేవలు 4జి కన్నా పది రెట్లు వేగంగా సేవలను అందిస్తాయని వివరించింది.