అమర్‌నాథ్ యాత్రికులపై పాక్ ఉగ్ర దాడి వ్యూహం భగ్నం

అమర్‌నాథ్ యాత్రికులపై పాకిస్థాన్ ఉగ్రవాదులు పన్నిన దాడి వ్యూహాన్ని జమ్మూకశ్మీర్ పోలీసులు విఫలం చేశారు. యాత్రికులపై దాడి జరిపేందుకు పాకిస్థాన్ దేశం నుంచి ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను నియంత్రణ రేఖ దాటించి శ్రీనగర్‌కు పంపింది.
పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు మంగళవారం నాటి ఎదురుకాల్పుల్లో హతమయ్యారు.  పీఓకేలో ఉన్న పాక్ హ్యాండ్లర్ అబూ హురియారా, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కమాండర్లను అమర్‌నాథ్ యాత్రపై దాడి చేయడానికి పాక్ పంపించిందని భారత నిఘా వర్గాలు తెలిపాయి.
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో మరణించగా, ఒక పోలీసుకు స్వల్ప గాయాలయ్యాయని కశ్మీర్ జోన్ పోలీసులు మంగళవారం తెలిపారు. శ్రీనగర్ ఎన్‌కౌంటర్‌ను పోలీసులు పెద్ద విజయమని పేర్కొన్నారు.శ్రీనగర్‌లోని బెమీనా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను శ్రీనగర్ పోలీసులు మట్టుబెట్టారని కశ్మీర్ జోన్ పోలీసులు మంగళవారం ట్వీట్ చేశారు.
‘‘సోపోర్ ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న ఉగ్రవాదుల సమూహం ఇదే. మేం వారి కదలికలను ట్రాక్ చేస్తున్నాం’’ అని పోలీసులు తెలిపారు.యాత్రపై దాడి చేయాలనే ఉద్దేశ్యంతో 2018 నుంచి పాకిస్థాన్‌లో ఉన్న పహల్గామ్-అనంతనాగ్‌కు చెందిన స్థానిక ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ మీర్‌తో పాటు ముగ్గురు మరణించారు.
ఉగ్రవాదులను అబ్దుల్లా గౌజ్రీ, ఆదిల్ హుస్సేన్ మీర్ (సుఫియాన్ ముసాబ్)లుగా పోలీసులు గుర్తించారు.గౌజ్రీ పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ నివాసి కాగా, ఆదిల్ హుస్సేన్ మీర్ అనంత్‌నాగ్ జిల్లా వాసి. పోలీసు రికార్డుల ప్రకారం ఆదిల్ 2018లో వాఘా నుంచి విజిట్ వీసాపై పాకిస్థాన్‌కు వెళ్లాడు.
చొరబాటుదారుల యత్నాన్ని అడ్డుకున్న బీఎస్ఎఫ్
మరోవంక,  జమ్మూకశ్మీరులోని ఆర్నియా సెక్టారులో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ సాయుధ చొరబాటుదారుల యత్నాన్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అడ్డుకుంది. రాత్రి సమయంలో ఆర్నియా సెక్టారులో సరిహద్దుల వద్ద పాక్ సాయుధులు మన దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు చేసిన యత్నాలను చూసిన బీఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తమై కాల్పులు జరిపాయి.
సరిహద్దుల్లో పహరా కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరపడంతో పాక్ సాయుధులు పారిపోయారు. అమరనాథ్ యాత్ర నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ పహరాను ముమ్మరం చేశారు. సరిహద్దుల్లో అనుమానాస్పద కదలికలపై కేంద్ర నిఘా సంస్థ భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. 
దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు రంగంలోకి దిగి కాల్పులు జరిపి పాక్ సాయుధ చొరబాటుదారులను తిప్పి కొట్టారు. రెండేళ్ల కరోనా వైరస్ మహమ్మారి తర్వాత జూన్ 30వతేదీన అమరనాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జమ్మూకశ్మీరులో భద్రతను కట్టుదిట్టం చేశారు