సినిమా చూసి వెక్కి వెక్కి ఏడ్చేసిన సీఎం బొమ్మై 

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తాజాగా రక్షిత్‌ శెట్టి లీడ్‌ రోల్‌లో నటించిన ‘777 ఛార్లీ’ సినిమా చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మనిషికి, పెంపుడు కుక్క మధ్య ఉన్న బాండింగ్‌ను ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో దర్శకుడు కిరణ్‌రాజ్‌ తెరకెక్కించారు. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన చూసి కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా ఎక్కి ఎక్కి ఏడ్చేశారు.
777 చార్లీ సినిమా జూన్ 10న ఐదు భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో హీరో, ఆయన కుక్కకు మధ్య ఉన్న బాండింగ్‌ను అందరికి కనెక్ట్​ అయ్యేలా.. హృదయాలను ఆకట్టుకునేలా చిత్రించారు. ఈ సినిమా చూసిన సీఎం బసవరాజు బొమ్మై తనకు 777 చార్లీ సినిమా చాలా నచ్చిందని తెలిపారు. సినిమాను నిర్మించినవారిని పొగడ్తల్లో ముంచెత్తారు. అందరూ తప్పకుండా ఈ సినిమా చూడాలని కోరారు.
బొమ్మై గతంలో స్నూబీ అనే కుక్కను పెంచారు.  ఆయన ఎంతో ఇష్టంగా, ప్రేమగా పెంచుకున్న పెట్​ డాగ్ స్నూబీ చనిపోయింది. బసవరాజు బొమ్మై సీఎం పదవి చేపట్టడానికి కొన్ని వారాల ముందు ఈ ఘటన జరిగింది.  దాని అంత్యక్రియల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చారాయన.
అంతేకాదు సీఎం అయ్యాక.. ఓ ఇంటర్వ్యూలో స్నూబీ ఫొటోల్ని చూపించగా కన్నీటి పర్యంతం అయ్యారు. కుక్కల మీద గతంలో సినిమాలు వచ్చాయి. కానీ, ఈ సినిమాలో భావోద్వేగాలతో చూపించారు. చార్లీ కేవలం తన కళ్ల ద్వారా భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది. సినిమా బాగుంది, అందరూ తప్పకుండా చూడాల్సిందే అని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
కుక్కలది షరతులు లేని ప్రేమ అని ఈ సందర్భంగా బొమ్మై పేర్కొన్నారు.  ప్రేమ, చాలా స్వచ్ఛమైనది.. అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడారాయన.  ముఖ్యంగా జంతు ప్రేమికులు అందరూ ఈ సినిమాను చూడవలసిందే అని ఆయన సూచించారు.