ప్రవక్తే బతికి ఉంటే… ముస్లిం మతోన్మాదులపై నస్రీన్ 

మహమ్మద్ ప్రవక్త పై వ్యాఖ్యల దుమారం కొనసాగుతుండటం, దేశంలోని పలు చోట్ల నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుండటం పట్ల  బంగ్లాదేశ్ సంచలన రచయిత్రి తస్లీమా నస్రీన్ విస్మయం వ్యక్తం చేశారు. ప్రవక్త ఈరోజు బతికి ఉంటే ముస్లిం మతోన్మాదుల పిచ్చితనం చూసి ఆశ్చర్యపోయేవారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మతోన్మాదుల ఆగడాలను చూస్తే దిగ్బ్రాంతి కలుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
”మహమ్మద్ ప్రవక్త బతికుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఉన్మాదుల పిచ్చితనం చూసి దిగ్భ్రాంతికి గురయ్యేవాడు” అని ఓ  ట్వీట్‌లో తస్లీమా స్పష్టం చేశారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నుపర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
 ‘‘విమర్శలకు ఎవరూ అతీతులు కాదు. ఏ మనిషీ, మత గురువూ, మత బోధకుడూ, ప్రవక్తా, దేవుడూ… ఎవరూ అతీతులు కారు. ప్రపంచాన్ని మరింత ఉత్తమంగా మార్చాలంటే సూక్ష్మ పరిశీలన, విమర్శ అవసరం’’ అని ఆమె స్పష్టం చేశారు. 
కాగా, కొద్ది రోజుల క్రితమే పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న అసహనంపై తస్లీమా మాట్లాడారు. భారతీయ దేవుళ్ల విగ్రహాలపై జరుగుతున్న దాడులను ప్రస్తావించారు. కరాచీలోని కోరంగి ప్రాంతంలో ఉన్న శఅరీ మరి మాతా మందిర్‌లోని విగ్రహాలపై దాడి జరిగిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.
పాకిస్థాన్‌లోనే కాకుండా, బంగ్లాదేశ్‌లోనూ అసహనం పెరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలు ముస్లిమేతరులతో జీవించడం నేర్చుకోవాలని, మనుషులుగా గుర్తించాలని ఆమె హితవు చెప్పారు. భారతదేశ ఉత్పత్తులను దేశం వెలుపల ముస్లింలు బాయ్‌కాట్ చేయడం అనేది పెద్ద లెక్కల్లోకి ఏమీ రాదని ఆమె పేర్కొన్నారు.
మనిషి, సాధువు, భగవంతుడు, జీసస్, ప్రవక్త ఎవరూ విమర్శలకు అతీతులు కాదనీ, ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి విమర్శనాత్మక పరిశీలన అవసరమని సూచిస్తూ తస్లీమా ట్వీట్ చేశారు.