బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు డీజీపీని కోరారు. అదేవిధంగా కోనసీమ అల్లర్లతో సంబంధం లేకపోయినా బీజేపీ అనుబంధ యువమోర్చా నాయకుడిని కేసులో ఇరికించడంపై కూడా పోలీసు అధిపతి దృష్టికి తీసుకెళ్ళారు. బీజేపీ రా ప్రధాన కార్యదర్శి శివన్నారాయణ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శుక్రవారం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చారు. డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంతో వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ నేతలపై కక్షగట్టి వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో సోము పర్యటన సందర్బంగా జొన్నాడ జంక్షన్ వద్ద ఆయన వాహనానికి అడ్డంగా ఒక ప్రైవేటు కంటైనర్ను నిలిపారని, ఆ వాహనం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
తమ పార్టీ అధ్యక్షునికి ప్రాణహాని తలపెట్టేందుకే ఇలా వ్యవహరించారని ఈమేరకు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్లలో కొండేటి ఈశ్వర్ గౌడ్ పేరును ఎఫ్ఐఆర్లో అక్రమంగా చేర్చారని ఆరోపించారు.
గతనెల 24న గౌడ్ గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సమావేశంలో పాల్గొని 26న కోనసీమ వెళ్లారని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని, తప్పుడు కేసులపై ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలని డీజీపీని కోరినట్లు శివన్నారాయణ వెల్లడించారు.
More Stories
7, 8 తేదీల్లో ప్రధాని మోదీ ఏపీలో పర్యటన
జగన్ అక్రమాస్తుల కేసుపై ప్రత్యేక కోర్టు కోరిన సీబీఐ
పోలవరం పునరావాసంకు `ప్రత్యేక సెస్’