ఆరోగ్యశ్రీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న జగన్

వై ఎస్ జగన్   ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ పధకాన్ని ప్రజలకు చేరనియ్యకుండా, ఆరోగ్యశ్రీ పేరుతో మోసం చేస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ విమర్శించారు. ఎన్టీఆర్  జిల్లా  బీజేపీ పదాదికారులతో సమావేశమవుతూ  ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి ప్రజలను చైతన్య పరచాలని సూచించారు.
ఆయుష్మాన్ భారత్ పధకంలో రూ 5 లక్షల జీవిత భీమా పధకం ఉంటే, ఆరోగ్య శ్రీ ద్వారా జీవిత భీమా సౌకర్యం లేదని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ లో కేవలం రూ  1,50,000 (వరకే వైద్యం చేయించుకోవడానికి అవకాశముందని ఆమె చెప్పారు.  తాను ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ జిల్లాకు పర్యటనకు వస్తానని, కార్యకర్తలకు అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు.
ఉన్న సమస్యలు పార్టీ కార్యాలయంలో గ్రీవియన్స్ బాక్స్ ఏర్పాటు చేసి తన దృష్టికి తేవాలని ఆమె జిల్లా బిజెపి అధ్యక్షులు బబ్బూరి శ్రీరామ్ కు ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఉన్న మొత్తం ప్రజలకు రెండు సార్లు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా దేశం నుండి కరోనాను తరిమేశారని ఆమె కొనియాడారు.
ఈసందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు ధరణికోట వెంకటరమణ జగ్గయ్యపేట లో కాలుష్యం సమస్య  గురించి కేంద్ర మంత్రికి వివరించి వినతి పత్రం అందజేశారు. దానిపై స్పందించిన మంత్రి తప్పకుండా జరుగుతున్న పరిణామాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  మంత్రి స్వయంగా జగ్గయ్యపేటకు వచ్చి పరిశీలిస్తానని ఆమె  హామీ ఇచ్చారు.