ఒడిశాలో కొలువుదీరిన నూతన మంత్రివర్గం

ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలతో మంత్రులంతా శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో ఆదివారం కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 21 మంది కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో 13 మంది కేబినెట్ ర్యాంకు హోదా కలిగిన మంత్రులు కాగా, 8 మంది సహాయ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. 

రాజీనామా చేసిన పాత మంత్రుల్లో 9 మందిని మళ్లీ తన మంత్రివర్గంలోకి నవీన్ పట్నాయక్ తీసుకోవడం గమనార్హం. 11 మందిని రాజీనామాలకే పరిమితం చేశారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్షంగా మిషన్ 2024 ను దృష్టిలో ఉంచుకుని నవీన్ పట్నాయక్ మంత్రి వర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు.

ఆరోసారి కూడా బిజూ జనతాదళ్ పార్టీని అధికారం లోకి తీసుకొచ్చేందుకు నవీన్ పట్నాయక్ ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. కొత్త మంత్రివర్గంలోకి ఆయన తీసుకున్న మంత్రుల జాబితాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కులం, మతం, యువత, అనుభవం ఉన్న మంత్రుల కలయికతో, సామాజిక సమీకరణాలతో కొత్త కేబినెట్‌ను నవీన్ పట్నాయక్ పట్టాలెక్కించారు.

గతంలో ఇద్దరు మహిళా మంత్రులు ఆయన కేబినెట్‌లో ఉంటే తాజాగా ఐదుగురు మహిళలకు మంత్రులుగా అవకాశమిచ్చారు. గత మంత్రివర్గంలో సహాయ మంత్రులుగా ఉన్న జగన్నాథ్ సరక, అశోక్ చంద్ర పాండాకు ఈ సారి కేబినెట్ ర్యాంకు మంత్రులుగా పదోన్నతి లభించింది.

శనివారం తన పదవికి రాజీనామా చేసిన అసెంబ్లీ స్పీకర్ ఎస్ఎన్ పాత్రో మంత్రివర్గంలో చేరనున్నట్లు వార్తలు వచ్చినా ఆయన చేరలేదు.  తెలుస్తోంది. పాత్రో మంత్రివర్గంలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. 

అయితే, అనారోగ్య కారణాలతోనే తన తండ్రి రాజీనామా చేసినట్లు ఆయన కుమారుడు బిప్లవ్ తెలిపారు. ఆయనకు ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని చెప్పారు. శనివారం మంత్రి పదవికి రాజీనామా చేసిన బీకే అరుఖా స్పీకర్ పదవిని చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

జూన్ 20వ తేదీన సీఎం నవీన్ పట్నాయక్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. రోమ్, దుబాయ్ను సందర్శించనున్నారు. జూన్ 22న శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటనకు ముందే మంత్రివర్గాన్ని మార్చాలని సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం మే 29తో మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో ఈ పార్టీ అధికారంలోకి రావడం ఇది వరుసగా ఐదోసారి కావడం విశేషం.