తెలంగాణ ఆర్టీసిలో వెళ్తే తిరుమల శ్రీవారి దర్శనం 

తెలంగాణ ప్రభుత్వ  ఆర్టీసి బస్సులో ప్రయాణం చేస్తే తిరుమలలో శ్రీ వారి దర్శనం చేసుకొనే సౌలభ్యం కల్పిస్తున్నారు. రెండు రోజుల ముందు బస్సు టికెట్ ను రిజర్వు చేసుకొంటే, వారికి తిరుమలలో రూ 300 టికెట్ తో శ్రీవారు దర్శనం చేసుకొనే వీలు ఏర్పడుతుంది. ఆ విధంగా ప్రతి రోజు 1,000 మందికి అటువంటి సౌలభ్యం కల్పించడానికి టిటిడి అంగీకరించింది. 

ప్రయాణికుల కోసం టిటిడి ఈ అవకాశం కల్పించినందుకు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ  సజ్జనార్ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టిఎస్ ఆర్టీసి ప్రయాణికుల సౌకర్యార్థం స్వామి వారి టిక్కెట్లను మంజూరు చేయడం హర్షణీయమని, భక్తులకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.

టిఎస్ ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం ఎంతో సురక్షితమని, కుటుంబ సమేతంగా స్వామిని హాయిగా దర్శించుకోవచ్చని వారు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా టిఎస్ ఆర్టీసి ప్రయాణికులకు రోజువారీగా 1,000 టిక్కెట్లను జారీ చేయనుందని వారు చెప్పారు. 

అయితే, ఈ ప్యాకేజీ కింద టిఎస్ ఆర్టీసి బస్సులో ప్రయాణించాలనుకునే వారు రెండు రోజుల ముందు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు. తక్షణం ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను జారీ చేయడానికి టిటిడి సైతం అనుమతి ఇచ్చిందని వారు పేర్కొన్నారు. 

ఈ ప్యాకేజీ వల్ల టిఎస్ ఆర్టీసికి మరింత ఆదరణ పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్యాకేజీని వినియోగించు కోవాలనుకునే ప్రయాణికులు తప్పనిసరిగా రెండు డోసుల టీకా సర్టిఫికేట్ లేదా దర్శనానికి 72 గంటలలోపు పొందిన కరోనా  నెగిటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించాలని వారు స్పష్టం చేశారు.