రాళ్లు వేయడం కాదు, భారత్ పరిస్థితి అర్థం చేసుకోండి

భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉక్రెయిన్‌లో ఘర్షణ పరిస్థితిని ఎక్కువ కాలం తట్టుకోలేవని, ఈ విషయాన్ని అన్ని దేశాలూ సరిగ్గా గుర్తించాల్సి ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. రాళ్లు వేయడం కాదు. ముందు పరిస్థితిని అర్థం చేసుకుంటే ఎటువంటి మాటలకు అయినా దిగవచ్చునని హితవు చెప్పారు. 
 
 స్లోవేకియాలో జరుగుతోన్న గ్లోబ్‌సెక్ 2022 బ్రెటిస్లేవా ఫోరం సదస్సులో ప్రసంగిస్తూ రష్యా నుంచి ముడి చమురును పొందడాన్ని ఆయన సమర్థించారు.రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై తలెత్తుతున్న విమర్శలను తిప్పి కొట్టారు.  ఉక్రెయిన్‌పై రెండు మూడు నెలలుగా యుద్ధం కొనసాగుతూ ఉన్నా ఇప్పటికీ ఐరోపా  దేశాలు రష్యా నుంచి చమురు తెప్పించుకుంటూనే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అటువంటి దేశాలు అనవసరంగా భారత్‌ను నిందించడం కుదరదని జైశంకర్ స్పష్టం చేశారు.
చమురు గ్యాస్‌లు విక్రయించడం ద్వారా వచ్చే నిధులను రష్యా ఉక్రెయిన్‌పై దాడి కొనసాగింపునకు వాడుతోందా? అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఇది అనుచిత అంశం అని పేర్కొన్నారు. దేశాలు తమ నిత్యావసరాల కోసం రష్యా నుంచి చమురు లేదా సహజ వాయువులను పొందుతున్నాయని, ఇది అనివార్యం అని తేల్చి చెప్పారు.
యుద్ధం దశలో నిత్యావసర సరుకులు కొరత వచ్చేలా చేసుకునే పరిస్థితి రాకూడదని అన్ని దేశాలు ఇదే కోరుకుంటాయని చెప్పారు.  ఐరోపా దేశాలు ఇప్పటికీ పైప్‌లైన్ల ద్వారా దండిగా రష్యా నుంచి గ్యాస్ పొందుతున్నాయి కదా? అని ప్రశ్నించారు. ఆ దేశాలు సరఫరాలు పొందడం న్యాయం, భారత్ తీసుకుంటే అన్యాయం అవుతుందా? అని ప్రశ్నించారు.
దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రష్యా ఏ క్రమంలో వాడుతున్నదనేది చెప్పడానికి భారతదేశానికి అయినా, ఇతర దేశాలకు అయినా సరైన వివరణలు ఉంటాయా? అని ప్రశ్నించారు.  రష్యా సరఫరాలపై ఇప్పుడు అమలులోకి వచ్చిన ఆంక్షలను ఆయన ప్రస్తావించారు. కొన్ని ఐరోపా దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునే ఇటువంటి నిర్ణయానికి వచ్చారని తెలిపారు.