అఫ్గాన్‌లో తాలిబన్ల నీడలో జైషే, లష్కరే శిక్షణా శిబిరాలు

ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన కుట్రదారు హఫీజ్ సయీద్ నేతృత్వంలోని లష్కరే తోయిబా. జైషే మహమ్మద్ లాంటి పాక్ ఉగ్రవాద సంస్థలు అఫ్గానిస్థాన్‌లో తమ శిక్షణా శిబిరాలను ఇప్పటికీ కొనసాగిసున్నాయని, వీటిలో కొన్ని తాలిబన్ ప్రభుత్వం కంట్రోల్‌లోనే ఉన్నాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక నివేదిక వెల్లడించింది. 

జైషే మహమ్మద్, సైద్ధాంతికంగా తాలిబన్‌కు సన్నిహితంగా ఉండే దేవ్‌బండి గ్రూపు నంగర్‌హర్ ప్రాంతలో ఎనిమిది శిక్షణా శిబిరాలను నిర్వహిస్తోందని, వీటిలో మూడు నేరుగా తాలిబన్ ప్రభుత్వ పర్యవేక్షణలోనే నడుస్తున్నాయని ఒక ఐరాస సభ్య దేశం తెలిపినట్లు ఐరాసకు ఉగ్రవాద కార్యకలాపాల విశ్లేషణ, ఆంక్షల పర్యవేక్షక కమిటీకి చెందిన 13వ నివేదిక పేర్కొంది. 

తాలిబన్ శాంక్షన్ కమిటీ అధ్యక్ష హోదాలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి భద్రతా మండలి సభ్య దేశాల దృష్టికి ఈ విషయాలు తీసుకు రావడానికి నివేదికను ట్రాన్స్‌మిట్ చేయడంతో పాటుగా మండలికి చెందిన ఒక డాక్యుమెంట్‌గా దీన్ని విడుదల చేశారు.

మసూద్ అజర్ నాయకత్వంలోని దేవ్‌బండి గ్రూపు అయిన జైషే మహమ్మద్ సైద్ధాంతికంగా తాలిబన్‌కు సన్నిహితమైందని ఈ నివేదిక పేర్కొంది, అఫ్ఘానిస్థాన్‌లోని జైషే మహమ్మద్‌కు కొత్త నాయకుడుగా కారీ రమజాన్ ఉన్నారు. అంతేకాదు తాలిబన్ కార్యకలాపాలకు గతంలో లష్కరే తోయిబా ఆర్థిక సాయంతో పాటుగా శిక్షణా నైపుణ్యాలను అందించాయని గత నివేదికల్లో పేర్కొన్న విషయాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది.

అఫ్ఘానిస్థాన్‌లోపల దీనికి మవ్లావి యూసఫ్ నాయకత్వం వహిస్తున్నారని, ఆ సంస్థకు చెందిన నాయకుడు మవ్లావి అసదుల్లా 2021లో తాలిబన్ డిప్యూటీ హోం మంత్రి నూర్ జలీల్‌ను కలిశారని కూడా ఒక సభ్య దేశం తెలిపింది.

ఈ ఏడాది జనవరిలో తాలిబన్ బృందం ఒకటి నంగర్‌హార్‌కుచెందిన హస్కామెనా జిల్లాలో లష్కరే తోయిబా ఉపయోగిస్తున్న శిక్షణా శిబిరాన్ని సందర్శించినట్లు కూడా ఆ సభ్య దేశం తెలిపింది. ఈ గ్రూపు కునార్, నంగర్‌హార్ ప్రాంతాల్లో మూడు శిక్షణా శిబిరాలను నిర్వహిస్తోందని ఐఎస్‌ఐఎల్‌కె లో చేరిన లష్కరే తోయిబా మాజీ సభ్యులు అస్లాం ఫరూఖి, ఎజాజ్ అహ్మద్ అహంగర్‌లాంటి వారు దీనిలో ఉన్నారని కూడా ఆ నివేదిక తెలిపింది.

అఫ్ఘానిస్థాన్‌లో ఉంటున్న విదేశీ ఉగ్రవాద యోధుల్లో తెహ్రీక్‌ఎతాలిబన్ పాకిస్థాన్(టిటిపి) అతిపెద్ద వర్గంగా ఉందని, దీనికి వేల సంఖ్యలో సభ్యులు ఉన్నట్లు కూడా ఆ నివేదిక వెల్లడించింది. మిగతా గ్రూపులకు కేవలం వందల సంఖ్యలోనే సభ్యులు ఉన్నట్లు కూడా తెలిపింది.

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం వల్ల ఎక్కువ లబ్ధి పొందింది కూడా ముఫ్తీనూర్ వలీ మెహ్సూద్ నేతృత్వంలోని ఈ గ్రూపేనని కూడా ఆ నివేదిక పేర్కొంది. తాలిబన్ ప్రభుత్వంలో ఆంతరంగిక, శరణార్థులు, పునరావాస మంత్రిత్వ శాఖలను హక్కానీ గ్రూపునకు ఇవ్వడాన్ని బట్టి కూడా ఆ గ్రూపునకు టిటిపితో సంబంధాలున్న విషయాన్ని తెలియజేస్తున్నాయని కూడా నివేదిక వెల్లడించింది.