తెలంగాణలో పీఎం కిసాన్ పథకం నిధులు సగం మందికి కూడా అందడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్కు, ప్రధాని మోదీని విమర్శించడంలో ఉన్న శ్రద్ధ.. రైతులకు మేలు చేయడంలో లేదని ఆమె ధ్వజమెత్తారు. పీఎం కిసాన్ వర్తించాలంటే ఈ నెలాఖరులోపు ఈకేవైసీ చేసుకోవాలని, కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందించే పీఎం కిసాన్పథకం రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాస్బుక్ ఉన్న రైతుల్లో 50 శాతం మందికి మాత్రమే అందుతోందని ఆమె తెలిపారు. కొత్తగా పాస్బుక్లు వచ్చిన లక్షలాది మందిని లబ్ధిదారులుగా గుర్తించట్లేదని ఆమె విమర్శించారు.
చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులకు పాస్బుక్లు బదిలీ అయినా పీఎం కిసాన్కు అప్రూవ్చేయడం లేదని, ఫలితంగా లక్షలాది మంది రైతులు కేంద్రం సాయాన్ని పొందలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అప్రూవ్ చేసే ప్రక్రియలో జాప్యంతో అర్హులైన వారు కూడా పెట్టుబడి సాయం పొందలేకపోతున్నారని ఆమె విమర్శించారు.
దీంతో రైతుబంధు సాయం అందుకుంటున్న వారిలో సగం మందికి కూడా పీఎం కిసాన్ అందని పరిస్థితి నెలకొందని ఆమె చెప్పారు. రాష్ట్రంలో 66.61 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండగా పీఎం కిసాన్కు 39.67 లక్షల మందినే రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించి కేంద్రానికి పంపించారని విజయశాంతి తెలిపారు. దీంతో 17.94 లక్షల మంది పీఎం కిసాన్ ప్రయోజనాన్ని కోల్పోతున్నారని ఆమె చెప్పారు.
ఇదిలా ఉంటే పీఎం కిసాన్ కోసం ఆధార్కు మొబైల్ నంబర్ను లింక్ చేయడానికి ఈకేవైసీ చేసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించిందని, ఈ నెల 31తో ఆ గడువు ముగియనుందని ఆమె పేర్కొన్నారు. అయితే కిందిస్థాయి అధికారులు పీఎం కిసాన్పై రైతులకు అవగాహన కల్పించడం తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని గురించి అసలు పటించుకోవడం లేదని తెలిపారు.
కేసీఆర్… కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీగారిని విమర్శించడం కాదు… కేంద్రం ఇస్తున్న పథకాలను రాష్ట్ర ప్రజల దగ్గరకు చేర్చాలని ఆమె కోరారు. రైతులకు పీఎం కిసాన్ ప్రయోజనం అందితే తమకు ఎక్కడ ఓట్లు పోతాయోనని కేసీఆర్ సర్కార్ దీన్ని నిర్లక్ష్యం చేస్తోందని విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్ చేస్తున్న అక్రమాలను తెలంగాణ రైతాంగం గమనిస్తోందని, త్వరలోనే ఈ అన్నదాతలు నీకు, నీ సర్కార్కు బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారే
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు