గబోన్, సెనెగల్, ఖతర్ పర్యటనకు ఉపరాష్ట్రపతి 

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 30 నుంచి జూన్ 7 వరకు గబోన్, సెనెగల్, ఖతర్‌లలో పర్యటించనున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి పవార్, ముగ్గురు పార్లమెంటు సభ్యులు సుశీల్ కుమార్ మోడి, విజయ్ పాల్ సింగ్ తోమర్, పి.రవీంద్రనాథ్ కూడా ఆయన వెంట మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. 
 
ఉప రాష్ట్రపతి స్థాయిలో ఈ మూడు దేశాల్లో పర్యటించనుండడం భారత్ నుంచి ఇదే తొలిసారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాదు, భారత్ నుంచి గబోన్, సెనెగల్‌కు ఇదే తొలి అత్యున్నత స్థాయి పర్యటన కావడం గమనార్హం.
 
మే 30 నుంచి జూన్ 1 వరకు గబోన్‌లో పర్యటించనున్న వెంకయ్యనాయుడు ఆ దేశ ప్రధాని హెచ్ఈ రోజ్ క్రిస్టియేన్ ఒసౌకా రాపోండా లో సమావేశమవుతారు. 
 
అలాగే, ఆ దేశాధ్యక్షుడు అలీ బొంగో ఒండింబా తోనూ భేటీ అవుతారు.  అక్కడి భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 
జూన్ 1 నుంచి జూన్ 3 వరకు సెనెగల్‌లో పర్యటించనున్న ఉప రాష్ట్రపతి.. 4-7 మధ్య ఖతర్‌లో పర్యటిస్తారు.