అనుచరుల విషప్రయోగంతో మావోయిస్టు సందీప్ మృతి!

మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత కీలక నాయకుడు సందీప్ కుమార్ మృతి చెందినట్లు తెలుస్తోంది. బీహార్‌లోని గయా జిల్లా లుతువా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు నాయకుడు సందీప్ కుమార్ అలియాస్ విజయ్ యాదవ్ అలియాస్ రూపేష్ (55) మృతదేహం లభ్యమైంది.
 
 సొంత పార్టీకి చెందిన అనుచరులే సందీప్‌పై విషప్రయోగం చేసి చంపేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  సందీప్ కుమార్ బీహార్ రాష్ట్రం గయా జిల్లా బాంకే బజార్ బ్లాక్‌లోని బాబూరామ్ దేహ్ గ్రామానికి చెందినవాడు. అతని భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. 
 
నక్సలైట్ సందీప్ యాదవ్‌పై బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో దాదాపు 500 కేసులు నమోదయినట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల్లో సందీప్ పై రూ.84 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. 
 
సందీప్ దాదాపు 3 దశాబ్దాలుగా బీహార్ జార్ఖండ్‌తో సహా వివిధ రాష్ట్రాల్లో అనేక విధ్వంస చర్యలకు పాల్పడ్డాడు. ఇతనిపై కేవలం బీహార్‌లోనే 100కు పైగా కేసులు నమోదయినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సందీప్ చిన్న వయసులోనే మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు, వారి కార్యకలాపాలకు ఆకర్షితుడై నక్సలైట్‌ పార్టీలో చేరాడు.
పార్టీలో సందీప్ అంచలంచెలుగా తన క్యాడర్‌ పెంచుకుంటు పోయాడు. అతని దాడిలో పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో అతను చేసిన మందుపాతర పేలుళ్ల దాడిలో అనేక మంది పోలీసులు గాయపడ్డారు. 2018లో దేశంలోనే తొలిసారిగా ఒక నక్సలైట్ నాయకుడైన సందీప్ పై ఈడీ చర్యలు తీసుకుంది.
సందీప్ కు చెందిన సుమారు రూ.86 లక్షల రూపాయల విలువైన స్థిర, చరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బృందం అదే సమయంలో జప్తు చేసింది. సందీప్ కి చెందిన ఫ్లాట్ల విలువ రూ.50 లక్షలుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంచనా వేసింది.