ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలు సూరత్, ఉదయగిరిలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. మంగళవారం ముంబైలోని మాజగావ్ డాక్స్లో అవి జలప్రవేశం చేశాయి.
ఈ యుద్ధ నౌకల డిజైన్ను డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ (డీఎన్డీ) రూపొందించింది. నౌకలు, జలాంతర్గాముల తయారు చేసే ముంబైకి చెందిన రక్షణ రంగ అనుబంధం సంస్థ మాజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) వాటిని తయారు చేసింది. దేశీయంగా తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారని సంస్థ వెల్లడించించి.
వీటి రాకతో నావికాదళం మరింత బలోపేతమైందని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశీయ అవసరాలను తీర్చుకోవడమే గాక మున్ముందు ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్ ఎదుగుతుందని ఆయన ఈ సందర్భంగా ధీమా వెలిబుచ్చారు. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో భారత నావికా దళానికిగల వ్యూహాత్మక అవసరాలను తీర్చడం కోసం కృషి చేస్తున్నందుకు ప్రశంసించారు.
కరోనా మహమ్మారి వేధిస్తున్నప్పటికీ నౌకల తయారీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నందుకు మజగావ్ డాక్స్ లిమిటెడ్ ను రక్షణ మంత్రి అభినందించారు. ఆత్మనిర్భర్ భారత్లో విక్రాంత్ యుద్ధ విమాన తయారీ ఒక మైలు రాయి అయితే, ఇసూరత్, ఉదయగిరిల తయారీతో మన రక్షణ సామర్థ్యం హిందూ మహా సముద్రం నుంచి ఫసిఫిక్, అట్లాంటిక్ దాకా విస్తరిస్తుందని రక్షణ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌక పీ15బి క్లాస్కు చెందినది. క్షిపణుల్ని ధ్వంసం చేసే సామర్థ్యం దీని సొంతం. దీన్ని బ్లాక్ నిర్మాణ పద్ధతుల్లో తయారు చేశారు. అంటే విడిభాగాలను వేర్వేరు ప్రాంతాల్లో తయారు చేసి వాటిని ఎండీఎల్లో జోడించారు. దీనికి గుజరాత్ వాణిజ్య రాజధాని సూరత్ పేరు పెట్టారు. నౌకల తయారీలో సూరత్కు ఘనచరిత్ర ఉంది. 16వ శతాబ్దంలోనే ఇక్కడ నౌక నిర్మాణం మొదలైంది. ఇక్కడ తయారైన వందేళ్ల నాటి నౌకలు ఇంకా చెక్కు చెదరలేదు.
ఉదయగిరికి ఆంధ్రప్రదేశ్లోని ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టారు. 17ఏ ఫ్రిగేట్స్ ప్రాజెక్టులో ఇది మూడో యుద్ధ నౌక. పీ17 ఫ్రిగేట్స్ (శివాలిక్ క్లాస్) కంటే దీన్ని మరింత ఆధునీకరించారు. మెరుగైన రహస్య ఫీచర్లు, అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, ప్లాట్ఫారం నిర్వహణ వ్యవస్థల్ని పొందుపరిచారు.
పీ17ఏ కార్యక్రమం కింద మొత్తం ఏడు నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. దీని నిర్మాణంలో తొలిసారిగా కొత్త పద్ధతుల్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు.
More Stories
ఏడాదికో ప్రధాని.. ‘ఇండియా’ కూటమి కొత్త ఫార్ములా
ఎన్నికల ప్రసంగం మధ్యలోనే స్పృహ తప్పిన గడ్కరీ
దేశంలో కాషాయ కెరటం ఉప్పొంగుతోంది