ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..27 మంది మృతి

పశ్చిమ ఢిల్లీ ముండ్కా వాణిజ్య భవనంలో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 27 మంది సజీవ దహనమయ్యారు. మరో 19 మంది గల్లంతయ్యారు. మరో 12 మందికి గాయాలు కాగా.. మరో 50 మందిని అధికారులు కాపాడారు. 
 
పశ్చిమ ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. నిన్న సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ప్రమాద సమాచారం అందినట్లు తెలిపారు ఢిల్లీ చీఫ్ ఫైర్ సర్వీస్ ఆఫీసర్ అతుల్ గార్గ్. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముప్పైకి పైగా ఫైరింజన్లతో అతి కష్టం మీద మంటలార్పామని అధికారులు పేర్కొన్నారు. 
 
ఫస్ట్ ఫ్లోర్ లోని సీసీటీవీ కెమెరాలు, రూటర్ తయారీ కంపెనీలు మంటలు చెలరేగాయని.. అక్కడి నుంచి భవనమంతా వ్యాపించినట్లు తెలిపారు. భవనం అంతా పొగ నిండిపోవడంతో  అందులోని వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో . మొదటి, రెండు అంతస్తుల్లోని అద్దాల కిటికీలు పగులగొట్టి పై నుంచి కిందకు దూకారు. మరికొందరు తాళ్ల సాయంతో కిందికి దిగారు. 
ఢిల్లీ అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లతో సహా పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు. 
 
ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాలు, రూటర్ ఆఫీస్ ఓనర్లు హరీశ్ గోయల్, వరుణ్ గోయల్ ను అదుపులోకి తీసుకున్నారు. బిల్డింగ్ ఓనర్ మనీష్ లక్రా పరారీలో ఉన్నారు. అగ్నిమాపక శాఖ నుంచి సేఫ్టీ క్లియరెన్స్ లేదని అధికారులు గుర్తించారు. 
 
 ప్రమాదం సమయంలో రెండో ఫ్లోర్ లో మోటివేషనల్ స్పీచ్ ఈవెంట్ జరుగుతుందని అధికారులు తెలిపారు.  ఆ ప్రోగ్రామ్ కు చాలా మంది హాజరవడంతో సెకండ్ ఫ్లోర్ లో ఎక్కువ మరణాలు జరిగాయని పెర్కోన్నారు. బయటకు వెళ్లేందుకు మెట్ల దారి ఒకటే ఉండటంతో.. ప్రజలు తప్పించుకోలేక పోయారని చెప్పారు.
 
 గాయపడిన వారికి సంజయ్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. దీంతో హాస్పిటల్ దగ్గరికి భారీగా బాదితుల కుటుంబసభ్యులు చేరుకున్నారు. ప్రమాద బాధితుల కోసం హాస్పిటల్ దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు సివిల్ డిఫెన్స్ ఆఫీసర్ ఎస్పీ తోమర్ తెలిపారు. గాయపడిన వారు, తప్పిపోయిన వారికి సాయం చేసేందకు డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.