కరోనా వేరియంట్ ఒమిక్రాన్ లో ఉత్పరివర్తనాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అథనామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక దేశాల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ 2 ఉనికి చాటుతున్నప్పటికీ , బీఏ 4,బీఏ 5 సబ్ వేరియంట్లు దక్షిణాఫ్రికాలో కొత్త ఉప్పెనకు దారి తీస్తున్నాయని వెల్లడించారు.
చాలా దేశాల్లో ఈ వైరస్ ఎలా మార్పులు చెందుతుందో తెలుసుకోలేక పోతున్నామని, తర్వాత ఏం జరుగుతుందో తెలియదని వెల్లడించారు. ఈ వేరియంట్లపై మిగిలిన దేశాలు జన్యుక్రమాన్ని విశ్లేషించడాన్ని మానివేయగా, దక్షిణాఫ్రికా ఇంకా దానిని కొనసాగిస్తోందని, అందుకే వాటిని గుర్తించ గలిగామని వెల్లడించారు.
ప్రజలను రక్షించుకోడానికి మన ముందున్న మార్గం వ్యాక్సినేషన్ అని, దాంతోపాటు కరోనా నియమావళిని పాటించాలని సూచించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. గత వారం 15 వేల మరణాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య కరోనా ప్రారంభ రోజుల నాటి స్థాయికి పడిపోయినట్టు తెలిపింది.
ఈ రెండేళ్ల కాలంలో 62 లక్షలకు పైగా మరణాలు సంభవించగా, వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తగ్గుదల సానుకూల పరిణామమే అయినప్పటికీ, పలు దేశాల్లో పరీక్షల సంఖ్య తగ్గడం కారణం కావొచ్చని పేర్కొన్నారు. అలాగే అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు కారణంగా కేసులు పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు.
More Stories
కాశ్మీరీ పండిట్లలో `గర్ వాపసీ’ ఆశలు
ఆక్రమిత కాశ్మీర్లో ప్రభుత్వంపై తిరగబడిన ప్రజలపై కాల్పులు
28200 మొబైళ్లు బ్లాక్.. 20 లక్షల నంబర్లు కట్!