ప్రమాదపు అంచుల్లో శ్రీశైలం ప్రాజెక్టు

దేశంలోనే అతిపెద్ద రెండవ జలవిద్యుత్ ప్రాజెక్టుగా పెరొంది, రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న కృష్ణానదిపై నిర్మించిన  శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పడు ప్రమాదపుటంచుల్లోకి చేరుకుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వరద నీటి వత్తిడిని సైతం తట్టుకుని నిలదొక్కుకున్న ఈ ప్రాజెక్టు పటిష్టత పట్ల ప్రభుత్వం తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
 
 డ్యాంకు పటిష్టతకు అవసరమైన చర్యలు తీసుకోవటంలో నిర్లక్షం చేసేకొద్దీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలు చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదలు వచ్చిన నేపధ్యంలో స్పిల్‌వే ద్వారా ప్రస్తుతం ఉన్న నిటి విడుదల సామర్ధం దృష్టిలో ఉంచుకొని తగిన ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అమల్లోకి తేవాలని సూచిస్తున్నారు.

కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఎబి పాండ్య నేతృత్వంలో నియమించిన పది మందితో కూడిన నిపుణుల కమిటీ ఈ ప్రాజెక్టు భద్రతపై సమగ్ర అధ్యయనం నిర్వహించి ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలో సూచిన ప్రకారం భారీ వరదల సందర్బంలో ప్రస్తుతం ఉన్న స్పిల్‌వే ద్వారా దిగువకు నీటివిడుదలతో పాటు అదనంగా మరో స్పిల్‌వేను కూడా నిర్మించే ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవాలి.

 అదే విధంగా భారీ వరదల సంర్బంగా జలాశయంలొకి చేరుతున్న వరదనీటి వత్తిడి నేరుగా డ్యాంపై పడి భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఇతర మార్గాల ద్వారా వరద నీటిని మళ్లించే ప్రతిపాదనలను కూడా పరిశీలన చేయాలని సూచిస్తున్నారు. కృష్ణానదిలో వెయ్యేళ్ల గరిష్ట వరద నీటి ప్రవాహాలను పరిగణలోకి తీసుకోని 1961లో శ్రీశైలం ప్రాజెక్టును డిజైన్ చేశారు. 

నిర్మాణ దశలో పలు ఆటుపోట్లను తట్టుకొని 1981 నాటి  ప్రారంభానికి నోచుకున్న ఈ ప్రాజెక్టు నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. డ్యాం 12 రేడియల్ క్రస్ట్ గేట్లతో 885అడుగుల స్థాయి గరిష్ట నీటి నిలువ సామర్దంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. కృష్ణానదిలో గరిష్ట వరద ప్రవాహాలను దృష్టిలో వుంచుకొని గేట్ల ద్వారా రిజర్వాయర్ నుంచి 13.20లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుల చేసేలా స్పిల్‌వేను నిర్మించారు.

కేంద్ర జలసంఘం నిపుణుల అంచనాలు, కృష్ణాలో భారీ వరద నీటి ప్రవాహాల అంచనాలు తలకిందులు చేస్తూ 2009 లోనే కృష్ణమ్మ భారీ వరదలతో తన మహోగ్ర రూపాన్ని చూపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కృష్ణా, తుంగభద్ర పరివాహకంగా కేవలం 48 గంటల వ్యవధిలోనే కురిసిన భారీ వర్షాలకు కర్నూలు, మహబూబ్ నగర జిల్లాల్లో జరిగిన ఆ నాటి వరద బీభత్స దృశ్యాలు ఇంకా ప్రజల కళ్లముందు కదులుతూనే ఉన్నాయి.

25.5లక్షల క్యూసెక్కుల వరద నీటి వత్తిడితో ప్రాజెక్టుకు పరీక్ష పెట్టింది. ప్రాజెక్టు డ్యాం గేట్లపైన 896అడుగుల ఎత్తలో కృష్ణమ్మ స్పిల్‌వేనుంచి కిందకు సుడులు తిరుగుతూ మహోగ్ర రూపం ప్రదర్శించింది. డ్యాం నుంచి వెనక్కి మళ్లిన వరదనీరు తుంగభద్రలో పోటెత్తి కర్నూలు నగరాన్ని నీట ముంచెత్తింది.  ఇటు మహాబూబ్‌నగర్ జిల్లాలోనూ బీచుపల్లివద్ద కృష్ణమ్మ జాతీయ రహాదారిని మళ్లేసింది.

 డ్యాం రేడియల్ గేట్ల ఎత్తును కొంత తగ్గించటం, గేట్ల స్థాయిని ఇప్పడున్న 892 అడుగుల స్థాయి నుంచి మరింత పెంచే అవకాశాలను పరిశీలించాలని ఆ కమిటీ తెలిపింది. ప్రస్తుతం ఉన్న స్సిల్‌వే 2009నాటి వరద ప్రవాహాల విడుదలకు ఏమాత్రం సరిపోదని స్పష్టమైంది. ఈ నేపధ్యంలో డ్యాంకు ఎగువన 5కి.మి వద్ద మరో స్పిల్‌వే నిర్మించాలని తెలిపింది. ఇందుకోసం కొండను తొలిచి 7.5కిమి పొడవున సొరంగ మార్గం నిర్మించాలని సూచించింది. 

ఈ సొరంగ మార్గం ద్వారా పంపే వరదనీటిని డ్యాంకు దిగువన 9కి.మి వద్ద నదిలో వదిలే ప్రతిపాదనను పరిశీలించాలని తెలిపింది.  అంతే కాకుండా అత్యవసర సమయాల్లో ఇటు తెలంగాణ వైపునుంచి నీటిని ప్రాజెక్టులకు మళ్లించుకోవటం, అటు ఏపి వైపు కూడా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ప్రాజెక్టులకు వరదను మళ్లించి ప్రధాన అనకట్టపై వరదనీటి ప్రవాహ వత్తిడిని తగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించింది.

శ్రీశైలం ఆనకట్టతోపాటు కుడి , ఎడమపైపు గట్లు కూడా దెబ్బతినకుండా వాటిని మరింత పటిష్టంగా రూపొందించాలని సూచించింది. డ్యాం 12రేడియల్ గేట్లు ఎత్తటం ద్వారా జలాశయంలోని నీరు ఎంతో వేగంగా గేట్ల నుంచి కిందకు దూకుతుంది. ఈ ప్రక్రియలో నీటి వత్తిడికి డ్యాం కూడా అక్కడక్కడా దెబ్బతింది. 

ఈ ప్రక్రియలో ప్లంజ్‌పూల్ ప్రాంతలో నది గర్బం లోతైన గుంతుల పడిపోయింది. పదేళ్లకిందటే అండర్‌వాటర్ వీడియోగ్రఫీద్వారా ఈ గుంతల పరిమానం గుర్తించారు. అంతే కాకుండా ఈ ప్రాంతలో కోతవల్ల డ్యాం భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది.