రాహుల్…. ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో అడుగు పెడుతున్నావ్?

‘‘ రేపో ఎల్లుండో కాంగ్రెస్ లో ఒకాయన ఢిల్లీ నుండి వచ్చి ఉస్మానియా వర్శిటీ పోతడట… ఆయన ఏ ముఖం పెట్టుకుని పోవాలనుకుంటున్నడు? తెలంగాణ ఉద్యమంలో 1400 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయింది కాంగ్రెస్ పాలనలోనే కదా.  ఆనాడే తెలంగాణ ఇచ్చి ఉంటే.. అంతమంది నా తమ్ముళ్ల ప్రాణాలు పోయేవి కాదు కదా…  అయినా సిగ్గు లేకుండా ఉస్మానియాకు ఎందుకు వస్తున్నట్లు?” అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
  ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 21వ రోజు మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సంజయ్ ధర్మాపురం గ్రామంలో బుధవారం రైతులు, స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ  బలిదానం చేసుకున్న “1400 మంది నా తమ్మళ్ల రక్తపు మరకలు చూడటానికి ఉస్మానియాకు రావాలనుకుంటున్నవా?” అంటూ ప్రశ్నించారు.
” తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు, కాళ్లు చేతులు విరగ్గొట్టుకుని భవిష్యత్ నే కోల్పోయిన నా వేలాది మంది యువకిశోరాల బతుకులను గెలిచేయడానికి వస్తున్నవా?’’అని నిలదీశారు.  సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణాలో రెండు రోజుల పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లే ప్రయత్నం  చేస్తుండడాన్ని ప్రస్తావిస్తూ  తెలంగాణ ఉద్యమంలో 1400 మంది బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు ద్వేషిస్తున్నారని స్పష్టం చేశారు.
  అందుకే తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ కు తొడపాశం పెట్టి, ఓడికొట్టారని అసంజయ్ దుయ్యబట్టారు. ఆ పార్టీ నుండి గెలిచిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల జాడే లేదని చెబుతూ ఎన్నికలొస్తే కెసిఆర్ పిట్టకథలు చెబుతూ, సెంటిమెంట్ రగిలిస్తూ, ఓట్లకోసం ప్రజల ముందుకు వస్తాడని హెచ్చరించారు. మన పోరాటంతో ఫార్మ్ హౌస్ లో పడుకునే కేసీఆర్ ను ప్రగతి భవన్ కు,  అక్కడి నుంచి బయటికి తీసుకు వచ్చామని చెప్పారు.

మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి 1.40 లక్షల ఇండ్లను ఇస్తే కేసీఆర్ ఇక్కడ ఇల్లు కట్టకుండా డ్రామాలు ఆడుతున్నాడని సంజయ్ ధ్వజమెత్తారు. యూపీలో 40 లక్షల మందికి ఇండ్లు కట్టించిన యోగీ మళ్లీ గెలిచి సీఎం అయ్యిండని చెబుతూ పేదలకు ఇండ్లు ఇవ్వని కేసీఆర్… తనకు మాత్రం రూ.800 కోట్లు పెట్టి, ప్రగతి భవన్ కట్టించుకున్నాడని విమర్శించారు. మోదీ ఇల్లిస్తే… మీరెందుకు మాకు ఇవ్వడంలేదని  టీఆర్ఎస్ వాళ్ళను గల్లా పట్టి అడగండి అంటూ చెప్పారు. 

సరోనా సమయం నుంచి 5 కిలోల బియ్యాన్ని మోదీ ఉచితంగా  ఇస్తున్నారని చెబుతూ తెలంగాణలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇస్తున్నది మోదీనే అని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం కింద రూ.277 కూలీ కేంద్రం ఇస్తుందని చెబుతూ కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ పథకం నిధులను కేసీఆర్ ఎందుకు కూలీలకు సకాలంలో ఇవ్వడంలేదు? అని ప్రశ్నించారు. 
తలాపున తుంగభద్ర నది ఉన్నా… మీకు మాత్రం నీళ్ళు రావడంలేదని విచారం వ్యక్తం చేశారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి తన ఫాంహౌస్లో వ్యవసాయానికి కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు తెచ్చుకున్నాడని దుయ్యబట్టారు. వరి వేస్తే ఉరే అంటాడు. పంట కొంటారా కొనరా అనే స్పష్టత లేదని లేదని మండిపడ్డారు. 
 
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని, ఇప్పటికే 75 శాతం మంది రైతులు నష్టానికి ధాన్యాన్ని అమ్ముకున్నారని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో పంట పొలాల్లో ఉన్న ధాన్యాన్ని రైతన్నలు కోల్పోయారని, దీంతో తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వమే ఆదుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు.