చిన్నపాటి వర్షంకే అతలాకుతలమైన యాదాద్రి

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ 2,000 కోట్ల మేరకు ఖర్చు పెట్టి చేపట్టిన యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణాల్లో డొల్లతనం చిన్నపాటి వర్షానికే నేడు బయటపడింది.  అభివృద్ధి పనుల్లో నాణ్యతాలోపం వెల్లడైనది.  
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన యాదగిరిగుట్ట అభివృద్ధి పనులు నాసిరకంగా జరిగిన్నట్లు స్పష్టమైనది. బుధవారం ఉదయం కురిసిన ఓ మాదిరి వర్షానికే అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం బయటపడింది. రంగరంగ వైభవంగా నిర్మించిన ఘాట్ రోడ్డు మొదలు క్యూ లైన్ల పరిస్థితి చూస్తే నాణ్యతా ప్రమాణాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో తేటతెల్లమవుతుంది. 

యాదగిరిగుట్టలో ఉదయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. అకాల వర్షంతో ఆలయ పరిసరాలు అస్తవ్యస్తం గా మారాయి. రోడ్లు కొట్టుకుపోగా, క్యూలైన్లు చెరువులను తలపించాయి. యాదగిరి గుట్ట ఆలయం పునర్నిర్మాణం జరిగి నెలలు గడవక ముందే ఒక్క భారీ వర్షానికే ఘాట్ రోడ్డు కుంగిపోయింది. 

ఆ ప్రాంతం బురదమయం కావడంతో బస్సులు దిగబడి పోయాయి. ఫలితంగా కొండపైకి రాకపోకలు నిలిచిపోయాయి. యాదగిరి నర్సన్న దర్శనానికి వచ్చిన భక్తులు కాలి నడకన కొండపైకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 

ప్రెసిడెన్షియల్ సూట్ రోడ్డులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడే ఉన్న రింగ్ రోడ్డు చెరువును తలపిస్తోంది. ఇక కొండపైన పరిస్థితి చూస్తే ఈదురుగాలులకు చలువ పందిళ్లు కుప్పకూలాయి. క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఒక్క వర్షానికే యాదాద్రి అభివృద్ధి పనుల్లో అధికారుల వైఫల్యం కనపించిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.