రంజాన్ పర్వదిన వేళ రాజస్థాన్లో అల్లర్లు చెలరేగాయి. జోధ్పూర్లో రెండు వర్గాల మధ్య సోమవారం రాత్రి ఘర్షన తలెత్తింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు కట్టదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్ను బంద్ చేసి.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.
జోద్పూర్లోని జలోరి గేట్ కూడలి వద్ద రెండు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. పరశురామ్ జయంతి పండుగ నేపథ్యంలో మూడు రోజుల ఉత్సవాలు జోధ్ పూర్ లో జరుగుతున్నాయి. పరశురామ్ జయంతి, రంజాన్ రెండు పండుగల నేపథ్యంలో ఇరు మతస్థులు వారివారి మతపరమైన జెండాలను ఎగురవేశారు.
ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య వాదన ప్రారంభమై, చివరకు ఘర్షణకు దారి తీసింది. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ నేపథ్యంలో జనాలను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఇదే సమయంలో పోలీసులపై కూడా కొందరు రాళ్లు రువ్వారు.
ఈ రాళ్ల దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను రంగంలోకి దించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ, అందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాను, మొబైల్ డేటాతో పాటుగా ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
More Stories
మణిపూర్లో పోలింగ్ కేంద్రం వద్ద కాల్పుల కలకలం
2040 నాటికి రొమ్ము క్యాన్సర్తో మిలియన్ మరణాలు
అనంత్నాగ్ లో మరో వలస కార్మికుడి కాల్చివేత