ఇంధన ధరలు అతి తక్కువగా పెరిగాయి

నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు అతి తక్కువగా పెరిగాయని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి స్పష్టం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రాలతో కేంద్రం సంబంధాలు సాగిస్తోందని చెప్పారు.  శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో చమురు ధరలు 30 శాతం మాత్రమే పెరిగాయని, 80 శాతం కాదని తెలిపారు.
‘దశాబ్దాలుగా బేసిక్‌ శాలరీలు పెరిగాయి. వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఉచిత పథకాలను అందిస్తోంది. కరోనా సంక్షోభం నుంచి మనం ఇంకా కోలుకోలేదు. దేశంలో 80 కోట్ల మందికి ఇప్పటికీ ఆహారం అందిస్తున్నాం. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది’ అని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. 

పైగా, ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య కారణంగా చమురు ధరలు బ్యారెల్‌కు 19.56 నుంచి 130 డాలర్లకు పెరిగాయని ఆయన చెప్పారు. 

కేంద్రం పెట్రోల్-డీజిల్‌పై రూ.32 ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తోందిని,  దీపావళికి ముందు ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో చమురు ధరలు తగ్గాయని వివరించారు. ఇంధన ధరల తగ్గింపు విషయంలో కేంద్రం తన బాధ్యతను స్వీకరించిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇక,  రాష్ట్రాలు కూడా తమ బాధ్యతను నిర్వర్తించాలని హితవు చెప్పారు.

రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు 0.2 శాతానికి మించిలేవని పేర్కొంటూ  నిబంధనలు ఒప్పుకుంటే ఎక్కువ శాతం ముడి చమురు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఏదేమైనా దేశ ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడబోమని హర్‌దీప్‌ సింగ్‌ పూరి తేల్చి చెప్పారు.