చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గ‌జం షామీ ఆస్తుల‌ను ఈడీ స్వాధీనం

విదేశీ మార‌క ద్ర‌వ్య చెల్లింపుల్లో అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌న్న ఆరోప‌ణ‌లతో చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గ‌జం షామీకి చెందిన రూ.5,551.27 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. .  వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న వేల కోట్ల రూపాయలను తాజాగా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
భారత్ లో షామీ 2014 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2015 నుంచి చెల్లింపులు చేస్తోంది. అయితే భారత్ లో వ్యాపారం నిర్వహిస్తూ, విదేశాల్లో ఉన్న మూడు సంస్థలకు రూ.5,551.27 కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని రాయల్టీ పేరుతో చెల్లించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. 
 
ఈ మూడు సంస్థల్లో ఒకటి షామీ గ్రూప్ కు చెందిన సంస్థ. ఎంఐ బ్రాండ్ ఉత్పత్తులకు షామీ ఇండియా భారత్ లో ట్రేడర్, డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ భారత్ లోని వివిధ తయారీదారుల నుంచి మొబైల్ ఫోన్లను సేకరించి ఎంఐ బ్రాండ్ కింద విక్రయిస్తుంది. విదేశాల్లో మూడు సంస్థల నుంచి ఎలాంటి సేవలను పొందడం లేదు. 
 
కానీ, ఆ మూడు సంస్థలకు పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్య చెల్లింపులు చేస్తోంది. దీనిపైనే ఈడీ దృష్టి సారించింది. షామీ తన గ్రూప్ సంస్థల మధ్య తప్పుడు లావాదేవీల కోసం పొంతనలేని పత్రాలు రూపొందించడమే కాకుండా, రాయల్టీ పేరుతో సొమ్మును విదేశాలకు తరలిస్తూ ఫెమా చట్టంలోని సెక్షన్ 4 నిబంధన ఉల్లంఘించిందని ఈడీ చెబుతోంది.