మత విద్వేషాలతో చెలరేగిన ఘర్షణలకు సంబంధించి జహంగీర్పురి హింసాత్మక ఘటనలో ఐదుగురు ప్రధాన నిందితులను ఢిల్లీ కోర్టు ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. కాగా, ఈ కేసులో మరో నలుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఐదుగురు నిందితులు- అన్సార్, సలీం, దిల్షాద్, సోనూ, అహిర్లపై జాతీయ భద్రతా చట్టం విధించబడింది.
శనివారం మొత్తం తొమ్మిది మంది నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోహిణి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ అంశం చాలా సున్నితమైనదని, కుట్రలో ప్రమేయం ఉన్న ఇతర నిందితులను గుర్తించేందుకు తదుపరి దర్యాప్తు చేయాల్సి ఉందని క్రైమ్ బ్రాంచ్ కోర్టుకు తెలిపింది.
విచారణలో నిందితులను పశ్చిమ బెంగాల్, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని క్రైమ్ బ్రాంచ్ కోర్టుకు తెలిపింది. నిందితులను ఎనిమిది రోజుల రిమాండ్కు పోలీసులు కోరారు. ఎన్ఎస్ఏ (నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ యాక్ట్) కింద అరెస్టు చేసిన ఐదుగురు నిందితులను కోర్టు ఎనిమిది రోజుల పోలీసు రిమాండ్కు పంపగా, మిగిలిన నలుగురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
మరోవంక, ప్రధాన నిందితుడు అన్సర్ షేక్తో పాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కేసులు నమోదు చేసింది. పోలీసులు నమోదు చేసే ఎఫ్ఐఆర్తో సమానమైన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసిఐఆర్)ను ఇడి దాఖలు చేసింది.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) లోని వివిధ క్రిమినల్ సెక్షన్ల కింద వారిపై అభియోగాలు మోపింది. దర్యాప్తు చేపట్టాల్సిందిగా కోరుతూ ఇటీవలే ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేష్ అస్తానా ఇడి డైరెక్టర్ సంజరు కుమార్ మిశ్రాకు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగానే ఇడి కేసు నమోదు చేసిట్లు అధికారులు తెలిపారు.
వాయువ్య ఢిల్లీలోని జహంగీర్పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురు పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన హింసలో రాళ్లు రువ్వడంతోపాటు కొన్ని వాహనాలు దగ్ధమయ్యాయి.
ఈ ఘటన తర్వాత అల్లరిమూకలపై తీసుకున్న చర్యలు ఒక ఉదాహరణగా ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు ఐదుగురు నిందితులపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు మోపారు.ఇప్పటివరకు జహంగీర్ఫురి కేసులో 25 మంది అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు బాలురు కూడా ఉన్నారు. ఢిల్లీ క్రైం బ్రాంచి అధికారులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
More Stories
ప్రశాంతంగా మూడో దశలో 64.58% పోలింగ్
ప్రతి సోమవారం ఇస్త్రీ చేయని ముడతల దుస్తులే
లష్కరే టాప్ కమాండ్ బాసిత్ అహ్మద్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం