ఈసారి నైరుతి రుతుప‌వ‌నాల‌తో మంచి వ‌ర్షాలే

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో దేశంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీర్ఘకాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదు కావొచ్చని పేర్కొంది. ఇక ఉత్తర, మధ్య భారతం, హిమాలయాలు సహా ఈశాన్య భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకావచ్చని ఐఎండీ చెప్పింది.

ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు సహా వాయవ్య, దక్షిణ భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షం కురుస్తుందని పేర్కొంది. గత మూడేళ్లలో కూడా భారత్‌లో నైరుతి రుతు పవనాల కారణంగా సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య గల కాలాన్ని నైరుతి రుతుపవనాల కాలంగా పరిగణిస్తుంటారు.

 జూన్‌ 1న కేరళలో నైరుతి రుతుపవనాల ప్రారంభం తర్వాత ఉత్తర, మధ్య భారత్‌లోని చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది. ఈశాన్య, వాయువ్య, అలాగే దక్షిణ ద్వీపకల్పంలోని దక్షిణ భాగాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. జూన్‌ 26-27 వరకు ఢిల్లీని రుతుపవనాలు తాకే చాన్సెస్ ఉన్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచనా వేసింది. వాతావరణ సమాచార ఏజెన్సీ స్కైమెట్‌ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 26 నుంచి 27 వరకు సాధారణ రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. జూలై వరకు విస్తరిస్తాయని పేర్కొంది.

 2022 లో సాధారణ వర్షపాతం నమోదయ్యేందుకు 40 శాతం అవకాశాలున్నాయి. సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదయ్యేందుకు 26 శాతం ఛాన్స్ ఉంది. ఇక లోటు వర్షపాతం నమోదయ్యేందుకు 15 శాతం, అతివర్షపాతం నమోదయ్యేందుకు 5 శాతం అవకాశాలున్నాయని ఐఎండీ లెక్కగట్టింది.