దేశ ద్రోహం కేసులో మణిపూర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను విమర్శించారంటూ మణిపూర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది సనౌజమ్‌ శ్యామ్‌ చరణ్‌సింగ్‌ (సనౌ)ను దేశద్రోహం కింద గత నెల పోలీసులు అదుపులోకి తీసుకోగా, మంగళవారం సాయంత్రం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. 
 
హిందీని జాతీయ భాషగా అభివృద్ధి చేయాలన్న అమిత్‌షా ప్రతిపాదనను తిరస్కరిస్తూ స్థానిక టివి చానెల్‌ నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో సనౌజమ్‌ పాల్గొన్నారు. బిజెపి యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఎం.భారిష్‌ శర్మ ఫిర్యాదు మేరకు ఏప్రిల్‌ 11న కేసు నమోదైంది. ఏప్రిల్‌ 12న ఇంఫాల్‌ పోలీసులు సనౌజమ్‌ని ఆయన నివాసం నుండి అదుపులోకి తీసుకున్నారు. 
 
ఆయనపై ఐపిసి సెక్షన్‌ 124 ఎ (దేశద్రోహం), 295 ఎ (ఉద్దేశపూర్వక హానికర చర్యలు, మత విద్వేషాలను రెచ్చగొట్టడం) 505 (బహిరంగ అనుచిత ప్రవర్తన) ల కింద పలు కేసులు నమోదయ్యాయి.  ఏప్రిల్‌ 9న స్థానిక టివిలో ‘హిందీ : ఏకీకృత నిర్ణయం, విధించడంపై చర్చ’ కార్యక్రమంలో సనౌజమ్‌ కూడా పాల్గొన్నారు. 
 
ఈశాన్య రాష్ట్రాల్లో 10వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేయాలన్న అమిత్‌ షా ఏకీకృత నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అమిత్‌షాను గడ్డంతో ఉన్న కోతితో పోల్చారని ఎం. భారిష్‌ శర్మ పేర్కొన్నారు. అసభ్యకరమైన, అవమానకరమైన భాషను వినియోగించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
నిందితుడు ఉద్దేశపూర్వకంగా హిందువులను జంతువులతో పోల్చారని, భారత్‌లోని హిందువుల జాతి, మతపరమైన భావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించారని తెలుపుతూ ఫిర్యాదు చేశారు. చర్చా కార్యక్రమంలో పాల్గన్న ఇతర వర్గాలు వారిస్తున్నప్పటికీ ఆయన వినిపించుకోలేదని పేర్కొన్నారు. 
 
మణిపూర్‌తో పాటు భారత్‌లోని ఇతర రాష్ట్రాల్లోని హిందువుల విశ్వాసాలను ఆగ్రహించేలా అమాయకపు ప్రజలను రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు.