ఏపీ ఆర్టీసీ ప్రయాణికులపై రూ 720 కోట్ల చార్జీల భారం

ఎపిలో ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో డీజిల్‌ సెస్‌ రూపంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఛార్జీల పెంపునకు సంబంధించి ఏపిఎస్‌ఆర్టీసి ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రయాణీకులపై రూ 720 కోట్ల అదనపు భారం వేస్తున్నట్లు ప్రకటించారు. 
 
గత రెండేళ్లుగా ఆర్టీసీకి అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని చెబుతూ ఆర్టీసీ రోజుకు 61 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోందని వివరించారు. డీజిల్‌ రేటు దాదాపు 60 శాతం పెరిగిందని, రెండేళ్లుగా రూ.5,680 కోట్ల ఆదాయం తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం నష్టాలను భరించలేని పరిస్థితికి ఆర్టీసీ వచ్చిందని చెప్పారు. 
 
తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్‌ ధరపై ఎలాంటి మార్పు చేయకుండా డీజిల్‌ సెస్‌ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పల్లెవెలుగు బస్సుల్లో రూ. 2, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ. 5, హైఎండ్‌(ఎసి) బస్సులకు రూ.10 చొప్పున డీజిల్‌ సెస్‌ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇది పూర్తిగా డీజిల్‌పై విధించే సెస్‌ మాత్రమేనని.. టికెట్‌ రివిజన్‌ కాదని ఆయన స్పష్టం చేశారు. గురువారం నుంచి పల్లె వెలుగు బస్సులో కనిష్ట ఛార్జీ రూ. 10గా ఉంటుందని,  డీజిల్‌సెస్‌ వల్ల ప్రజలపై ఏడాదికి రూ.720 కోట్ల భారం పడుతుందని వివరించారు.
ప్రస్తుతం ఆర్టీసీలో భారం భరించలేని పరిస్థితి ఉందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రయాణికులపై భారం వేసినట్లు ఆయన చెప్పారు. ఉపయోగంలో లేని ఆర్టీసీ ఖాళీ స్థలాలను లీజుకు ఇస్తామని ఆర్టీసీ ఎండీ చెప్పారు. కార్గో సేవల ద్వారా కూడా ఆర్టీసీ ఆదాయం పెంచుకుంటామని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.