కరోనా మళ్లీ పుంజుకునే ప్రమాదం.. ప్రధాని హెచ్చరిక 

కరోనా వైరస్ ఉధ్ధృతి తగ్గినట్టు కనిపిస్తున్నా అదింకా అంతరించిపోలేదని, మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.  అందుకే కరోనాపై చేస్తున్న పోరులో ఎట్టి పరిస్థితుల్లోను అలసత్వం వహించవద్దని ప్రజలను వారించారు. ఎన్నో రూపాలను మార్చుకుంటున్న మహమ్మారి మళ్లీ ఎప్పుడు విరుచుకుపడుతుందో ఎప్పటికీ తెలియదని పేర్కొన్నారు.

ఇటువంటి కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఇప్పటివరకు 185 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామన్న ఆయన ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. అయితే అత్యంత వేగంగా సంక్రమిస్తోన్న ఎక్స్‌ఈ వేరియంట్ గుజరాత్‌లో వెలుగు చూసిన నేపథ్యంలో ప్రధాని మరోసారి ప్రజలను అప్రమత్తం చేశారు.

గుజరాత్ లోని జునాగడ్ జిల్లాలో వంథలిలో మాయుమియా ధామ్ ఆలయ 14వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన  మహాపటోత్సవ్ కార్యక్రమంలో వర్చువల్ పద్ధతితో మోదీ మాట్లాడుతూ కడ్వాపటీదార్ సమాజానికి చెందిన దేవత మా యుమియా. మాయుమియా భక్తులు పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్న పిల్లల సంరక్షణకు అలాగే ఎనీమియాతో బాధపడుతున్న తల్లుల ఆరోగ్య భద్రత కోసం గ్రామస్థాయిలో ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు.

ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్న మాయుమియా ట్రస్టు పిల్లల ఆరోగ్యం ప్రోత్సహించే విధంగా గ్రామస్థాయిలో పోటీలు నిర్వహించాలని సూచించారు. ఇదే సమయంలో మాతృభూమిని రసాయన ఎరువుల నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉందని కడ్వాపటీదార్ రైతులకు ఉద్ఘాటించారు. ఇందుకోసం ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ప్రతి గ్రామం నుంచి రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ప్రకృతి వ్యవసాయానికి అంకితమైన గవర్నర్‌గా ఆచార్యదేవ్‌వ్రత్ గుజరాత్‌కు ఉన్నారని, ఆయన తాలూకా స్థాయిలో వ్యవసాయ రైతుల సమావేశాలు నిర్వహించి ప్రకృతి వ్యవసాయం వైపు చైతన్యం కలిగించడంతో గుజరాత్‌లో లక్షలాది మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి మళ్లించగలిగారని ప్రధాని కొనియాడారు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న అజాద్‌కీ అమృతోత్సవ్‌లో భాగంగా ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్‌లు (చెరువులు) సృష్టించాలని సూచించారు. లక్షలాది చెక్‌డామ్‌లు కట్టే మీకు చెరువులు నిర్మించడం పెద్ద సాహసమేదీ కాదని ప్రజలను ఉద్దేశించి సూచించారు. 

జలసంక్షోభంతో బాధపడుతున్నప్పటికీ జలసంరక్షణ విధానాలను అనుసరించడం మరిచిపోరాదని స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం రుతుపవనాలకు ముందుగా చెరువుల పూడిక తీయడం, నీటి కాలువలు శుభ్రం చేయడం, తదితర విధానాలతో జలసంరక్షణ చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.