జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం గాలింపు

జమ్మూకశ్మీరులోని షోపియాన్ జిల్లాలోని లడ్డీ ప్రాంతంలో ఉగ్రవాదులు,భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.హరిపోరా ట్రెంజ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భారత సైన్యం, పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
 
ఈ ఎదురు కాల్పుల్లో ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియలేదు. ఇటీవల దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని ఛోటోగామ్ ప్రాంతంలో కశ్మీరీ పండిట్ దుకాణదారుడిపై ఇద్దరు మోటారుసైకిల్‌పై వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
 
గత రెండు రోజుల్లో పుల్వామాలో నలుగురు స్థానికేతర కార్మికులు, శ్రీనగర్‌లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లతో సహా ఏడుగురిపై జమ్మూ కాశ్మీర్‌ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారు. దీంతో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.
ఉగ్రవాదం 45% తగ్గింది
ఇలా ఉండగా, గడిచిన నాలుగేళ్లలో జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం 45 శాతం తగ్గిందని కేంద్ర హోంశాఖ బుధవారం పార్లమెంట్‌లో ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ పరిణామాలపై అనేక ఆందోళనలు వ్యక్తం అయినప్పటికీ.. ఉత్తమ ఫలితాలను ఇస్తాయని ప్రభుత్వం చాలా రోజులుగు చెప్పుకుంటూ వస్తోంది. 
 
అయితే జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన డేటాను కేంద్ర హోంశాఖ మంత్రి నిత్యానంద్ రాయి విడుదల చేస్తూ.. తమ ప్రభుత్వ చర్యలు కశ్మీర్‌లకు మేలు చేశాయని చెప్పుకొచ్చారు. 2018లో జమ్మూ కశ్మీర్‌లో 417 ఘటనలు జరగ్గా.. 2021 నాటికి అవి 229కి తగ్గాయని కేంద్ర మంత్రి తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు సగానికి సగం తగ్గాయని ఈ డేటా వెల్లడిస్తోందని ఆయన ప్రస్తావించారు.
ఇక ఉగ్రదాడుల్లో చనిపోయిన వారి డేటాను కూడా విడుదల చేశారు. 2019 ఆగస్టు 5 నుంచి 2021 మధ్య జరిగిన దాడుల్లో 87 మంది పౌరులు, 99 మంది భద్రతా సిబ్బంది మరణించారట. అయితే 2014 నుంచి 2019 మధ్య జరిగిన దాడుల్లో 177 మంది పౌరులు, 406 మంది భద్రతా సిబ్బంది చనిపోయినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.