ఏపీలో మార్పు కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు

ఏపీలో అధికార దాహం పెరిగిపోయిందని, సేవ చేయడం కన్నా… అధికారమే లక్ష్యంగా పని చేస్తున్నారని విమర్శిస్తూ రాష్ట్రంలో  మార్పు కావాలని ప్రజలు ఎదురు చుస్తున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి 
దగ్గుబాటి పురంధరేశ్వరి స్పష్టం చేశారు.
 
బిజెపి 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన నిర్వ‌హిస్తోన్న కార్యక్రమాలు వేరైనా బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.  పెట్రోల్, డీజిల్ ఛార్జీల విషయంలో కేంద్రం తన వంతు బాధ్యతగా తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం పన్నుల విషయంలో ఎందుకు తగ్గించడం లేదని ఆమె ప్రశ్నించారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగాయని ఆమె చెప్పారు.
 
విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ నాయకులు బీజేపీ నేతలను తప్పు పట్టే అర్హత లేదని ఆమె స్పష్టం చేశారు. మిత్రపక్షంగా పవన్ కళ్యాణ్ తమతో చర్చిస్తే. తాము కూడా స్పందిస్తామని ఆమె పేర్కొన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ప్రజల ఆకాంక్షలను కేంద్రం పెద్దలకు వివరిస్తామని ఆమె తెలిపారు.
 
వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని  ఆమె విమర్శించారు. తమ ప్రణాళికలు తమకు ఉన్నాయని.. వాటికి అనుగుణంగా పని చేస్తామని పురంధేశ్వరి స్పష్టం చేశారు.
 
దేశ సేవకు ప్రతి బీజేపీ కార్యకర్త పునరంకితం కావాలని ఆమె పిలుపిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టారని చెబుతూ  ఉత్తరప్రదేశ్‌లో రెండో సారి అధికారం ఇవ్వడం అంటే బీజేపీ పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకమని అని ఆమె తెలిపారు. 
 
మోదీ ప్రధానిగా ఎనిమిదేళ్ళ కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, దేశంలో పేదల అభ్యున్నతికి కృషి చేశారని ఆమె కొనియాడారు. ప్రతి కార్యకర్త కూడా పార్టీ గెలుపు కోసం పని చేయాలని చెబుతూ  ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రకాశ్’  సూత్రంతో  ముందుకు వెళుతున్నామని ఆమె చెప్పారు.
 
కాగా, గుంటూరు  నగరంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను జాతీయ నేత కన్నా లక్ష్మినారాయణ ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి  ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. 
 
ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు వల్లూరి జయప్రకాశ్ నారాయణ, శనక్కాయల అరుణ, పాటిబండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేతలకు కన్నా లక్ష్మి నారాయణ సన్మానం చేశారు.