మాస్కులు వదిలివేసే సమయం ఇంకా రాలేదు

ఒమిక్రాన్ వేరియంట్ ఉపరకాలైన బీఎ 1, బీఏ 2ల మిశ్రమ ఉత్పరివర్తనాలైన ఎక్స్ ఈ వేరియంట్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని, అత్యంత తీవ్రంగా వ్యాప్తి చెందే బిఎ 2 కంటే ఇది 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్నట్టు నిర్ధారణ అయిందని నిపుణులు చెబుతున్నారు. 
 
దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా భారత్ లోని నిపుణులు దీనిపై స్పందిస్తూ మాస్కులపై అశ్రద్ధ వహించకూడదని హెచ్చరిస్తున్నారు.  మాస్కులు తీసే సమయం ఇంకా రాలేదని స్పష్టం చేస్తున్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో మాస్కులు తీయొద్దని ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడు అరుణ్ గుప్తా ఓ జాతీయ మీడియా సంస్థతో పేర్కొన్నారు.
బ్రిటన్, అమెరికా, చైనా, హాంకాంగ్ దేశాల్లో వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉందని, భారత్‌లో మళ్లీ విజృంభించదని చెప్పలేమని తెలిపారు. అందుకే కనీసం ఏడాది పాటు కొత్త కేసుల్లో పెరుగుదల కనిపించనంత వరకు కరోనా నిబంధనలను ప్రభుత్వాలు ఎత్తి వేయకూడదని ఆయన సూచించారు.
ఎక్స్ ఈ వేరియంట్ జనవరి మధ్యలో మొదటిసారి బయటపడిందని, అయితే భయపడాల్సిన అవసరం లేదని తాను నమ్ముతున్నానని టాటా ఇన్‌స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 600 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు.
అయితే మనం దాన్ని నిశితంగా గమనించాల్సి ఉందని చెప్పారు. ఇది ఏ స్థాయిలో వ్యాపిస్తుందో చెప్పేందుకు కచ్చితమైన ప్రమాణికాలు లేవని చెబుతూ  దీనిపై మరింత సమాచారం అవసరం అని పేర్కొన్నారు.