32 ఏళ్ళ తర్వాత కాశ్మీర్ లో పండిట్ల వేడుకలు 

కశ్మీర్ పండిట్లు శనివారంనాడు శ్రీనగర్‌లోని దాల్ లేక్ వెంబడి నూతన సంవత్సర  వేడుకలను ఎంతో కోలాహలంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకొన్నారు. మాతా సారికా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కశ్మీర్ లోయను విడిచిపెట్టినప్పటి నుంచి 32 ఏళ్ల తర్వాత  సొంతగడ్డపై వీరు ‘నవ్‌రెహ్’ (న్యూఇయర్) జరుపుకోవడం ఇదే మొదటిసారి.
 
 కశ్మీర్ క్యాలెండర్ ప్రకారం నెవ్‌రెహ్ అంటే నూతన సంవత్సరంలోని తొలి రోజు అని అర్ధం. కశ్మీర్‌ లోయలో గత రెండేళ్లుగా పరిస్థితి మెరుగైందని ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉగ్రవాద  కార్యకలాపాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని,  ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న సానుకూల చర్యలతో ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, స్వస్థలాలకు తిరిగి రాగలమనే ఆశాభావంతో ఉన్నామని పలువురు చెప్పారు.
పాత  శ్రీనగర్‌లోని హబ్బా కడల్ ఏరియాలోని స్థానిక కశ్మీర్ పండిట్ ఒకరు మాట్లాడుతూ, కశ్మీర్ చుట్టూనే తన మనసు తిరుగాడుతుందని, ఇది తన దేశమని, 1990లో కశ్మీర్ విడిచిపెట్టే సమయంలో తన తల్లిదండ్రులు హతమయ్యారని తెలిపారు. అయితే తాను మాత్రం ఎప్పటికీ కశ్మీర్‌ను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
32 ఏళ్లుగా ఇదే ఆలయంలో తాను ప్రార్థనలు చేస్తున్నప్పటికీ కశ్మీర్‌లో ఈరోజు మార్పు వచ్చిందనే అనుభూతి కలిగిందని చెప్పారు. ఆలయానికి కూడా గణనీయంగా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారని తెలిపారు.