రష్యా – భారత్‌ల మైత్రిపై అమెరికా ఆగ్రహం

రష్యా – భారత్‌ల మైత్రిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.  దేశ అవసరాల దృష్ట్యా కేంద్రం సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ను దిగుమతి చేయాలని ఉక్రెయిన్‌ను కోరింది. కానీ ఉక్రెయిన్‌ అందుకు కాదనడంతో భారత్‌  రష్యా నుంచి సుమారు 45వేల టన్నలు సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసింది. ఇప్పుడీ ఆయిల్‌ కొనుగోళ్లతో అమెరికా భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతులు చేసుకుంటే భారత్‌కు ‘గ్రేట్‌ రిస్క్’ అంటూ అభివర్ణించింది. ఇప్పటి వరకు చేసిన ఆయిల్‌ దిగుమతులు చాలని, ఇకపై ఎలాంటి దిగుమతులు చేయరాదని హుకుం జారీ చేసింది.  మరోవంక, ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం సంక్షోభానికి తెర పడవచ్చన్న ఆశలపై రష్యా నీళ్లు చల్లింది. తాజాగా జరిపిన చర్చల్లో (మంగళవారం) పెద్ద పురోగతేమీ లేదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్‌ పెదవి విరిచారు. 

అదే సమయంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ గురు, శుక్రవారం భారత్‌లో పర్యటన అమెరికాకు అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఈ పర్యటనపై భారత్‌-రష్యాల మధ్య వ్యాపార సంబంధమైన ఒప్పొందాలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో రష్యా- భారత్‌ స్నేహంపై అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. 

రష్యా నుంచి భారత్‌ ఆయిల్‌ను దిగుమతులు చేసుకోకూడదని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి హెచ్చరించినట్లు  తెలుస్తోంది. రష్యాతో వాణిజ్యం భారత్‌కు ప్రమాదమేనన్న సంకేతాలు మొదలయ్యాయి. ఒకవేళ అమెరికా కాదన్నా రష్యా నుంచి ఆయిల్‌ను కొనుగోలు చేస్తే భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉందని, అందుకు ఈ తాజా పరిణామాలు ఊతం ఇస్తున్నాయి.   

రాయిటర్స్‌ కథనం ప్రకారం గతంలో భారత్‌ రష్యా నుంచి డిస్కౌంట్‌లో ఆయిల్‌ను కొనుగోలు చేస్తే ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ యుద్ధం సంక్షోభ సమయంలో ఆయిల్‌ ఉత్పత్తులపై అమెరికా అడ్డు చెబుతోంది. ఓవైపు భారత్‌తో తాము స్నేహంగా ఉంటామని అదే సమయంలో రష్యాకు మద్దతు ఇస్తే  సహించబోమని అమెరికా..,భారత్‌కు సంకేతాలు పంపిస్తుంది.

ఉక్రెయిన్‌ పై రష్యా చేస్తున్న యుద్ధం వీలైనంత త్వరగా ముగించేందుకు పుతిన్‌ పై ఒత్తిడి తెస్తామని, ఇందుకు భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నట్లు యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి ఒకరు చెప్పారు.

కాగా, భారత్‌ రూపాయి-రూబుల్ చెల్లింపుల అంశంపై అమెరికా ప్రభుత్వానికి ఎలాంటి ఆందోళన కలిగించదు. “వారు ఏమి చెల్లిస్తున్నా, వారు ఏమి చేస్తున్నా, వారు ఆంక్షలకు అనుగుణంగా ఉండాలి. ఆంక్షలకు కట్టుబడి, కొనుగోళ్లను గణనీయంగా పెంచనంత కాలం అమెరికా మద్దతు ఉంటుంది” అంటూ  అమెరికా ప్రభుత్వ ప్రతినిధి చెప్పారంటూ రాయిటర్స్ వెల్లడించింది. 

మరోవంక, “క్వాడ్ భాగస్వాములైన అమెరికా, ఆస్ట్రేలియాలు..రష్యాతో భారత్‌ వాణిజ్య ఒప్పందాల్ని వ్యతిరేకిస్తున్నాం. రష్యా ఒకవైపు.. ఉక్రేనియన్ ప్రజలకు  స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం అందించేందుకు అమెరికా వైపు నిలబడే సమయం ఆసన్నమైంది. పుతిన్ చేస్తున్న మారణ హోమానికి నిధులు, ఇంధనంతో పాటు ఇతర సహాయం చేయోద్దు” అంటూ యూఎస్‌ వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో స్పష్టం చేశారు. 

ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ టెహన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశాలు “నిబంధనల ఆధారిత విధానాన్ని కొనసాగించడానికి” కలిసి పనిచేయాలని అన్నారు.

ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం కారణంగా,  ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో ప్రపంచ దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధిస్తున్న సమయంలో భారత్‌ మాత్రం ఆయిల్‌ దిగుమతులు పెంచుతుంది. 2021లో భారత్‌ రష్యా నుంచి 16 మిలియన్‌ బ్యారళ్లను కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుండి కనీసం 13 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేసింది.