హలాల్ పై అభ్యంతరాలు పరిశీలిస్తున్నాం… బొమ్మై

‘హలాల్’ మాంసాన్ని బహిష్కరించాలని  కొన్ని హిందూ సంస్థలు  హిందువులకు పిలుపునివ్వడంతో  కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.  హలాల్ మాంసంపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నందున ఆ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు.

ఇది (హలాల్ మీట్) ఒక అలవాటుగా మాత్రమే వస్తోందని, దీనిపై ఎవరైనా తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు ఆ అంశాన్ని పరిశీలించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆయా గ్రూపులు చేస్తున్న డిమాండ్‌పై ప్రభుత్వం అధ్యయనం చేసి, వారు చెబుతున్నది నిజమా కాదా అనేది అంచనా వేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.

త్వరలోనే ఈ అంశంపై ప్రభుత్వం ఒక స్పష్టతనిస్తుందని తెలిపారు. రైట్ వింగ్ డిమాండ్ చేసిందా, లెఫ్ట్ వింగ్ డిమాండ్ చేసిందా అనేది తమకు ప్రధానం కాదని, అభివృద్ధి, శాంతి, ప్రజాభద్రత అనేవే ప్రభుత్వానికి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కాగా, రాష్ట్రంలో హలాల్ మాంసాన్ని బహిష్కరించాలంటూ హిందూ రైట్ వింగ్ గ్రూప్స్ కొద్దిరోజులుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ ప్రధాన కార్యదర్శి సీటీ రవి సైతం దీనిపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. హలాల్ ఫుడ్‌ను ‘ఎకనామిక్ జీహాద్’గా ఆయన అభివర్ణించారు.
ఇదొక జీహాద్‌గా ముస్లింలు వాడుకుంటున్నారని, బలవంతంగా రుద్దుతున్నారని, వాళ్ల హలాల్‌ను ఇందుకోసం వాడాలని అనుకుంటే, అలా వాడుకోవడం కుదరదని చెప్పడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.

”హిందువుల నుంచి మాసం కొనేందుకు ముస్లింలు నిరాకరిస్తున్నప్పుడు, మా దగ్గర మాసం కొనమని హిందువులను ఎలా వాళ్లు పట్టుపడతారు?” అని రవి ప్రశ్నించారు.

హిజాబ్‌తో పరీక్షలకు అనుమతించిన ఉపాధ్యాయుల సస్పెన్షన్ 

ఇలా ఉండగా,  హిజాబ్‌తో విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారంటూ మీడియాలో వచ్చిన ఓ వీడియో ఆధారంగా ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు. వీరిలో ఇద్దరు చీఫ్‌ ఇన్విజిలేటర్లు కూడా వున్నారు. గడగ్‌లోని సిఎస్‌ పాటిల్‌ హైస్కూల్‌లోని పరీక్షా కేంద్రాల్లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

టీచర్లను సస్పెండ్‌ చేస్తూ డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్‌ బసవలింగప్ప ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి హిజాబ్‌తో పరీక్షలు రాయడానికి అనుమతించినందుకే ఈ చర్య తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన వార్తలను చూసి ఆ స్కూళ్లను సందర్శించిన గడగ్‌ తహసిల్దార్‌ అందచేసిన నివేదిక, స్పాట్‌ ఎంక్వైరీ ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.