పెగాసెస్‌ వ్యవహారంపై అసెంబ్లీ హౌస్‌ కమిటీ

టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇజ్రాయెల్ నుండి నిఘా పరికరం పెగాసెస్‌ కొనుగోలు చేసిన్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ఏపీ  శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారం హౌస్‌ కమిటీ వేశారు. 
 
ఈ కమిటీ చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించారు. అదే విధంగా కమిటీ సభ్యులుగా భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, కొలుసు పార్థసారధి, అమర్నాథ్‌, మేరుగు నాగార్జున, మద్దాల గిరిధర్‌ను నియమించారు.
కాగా రాష్ట్రంలో పెగసస్‌ స్పైవేర్‌ బాగోతం గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో తీవ్ర రాజకీయ కలకలం రేపుతోంది. రాష్ట్ర శాసనసభలోనూ దీనిపై సోమవారం తీవ్ర దుమారం రేపింది. అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.
దీంతో స్పైవేర్‌ ఉదంతంపై  హౌస్‌ కమిటీ ఏర్పాటుచేయాలని సోమవారమే అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం నాడు పెగాసెస్‌ వ్యవహారంపై స్పీకర్‌ హౌస్‌ కమిటీ వేశారు.
 
15వ శాసనసభ ఎనిమిదో సమావేశాలు శుక్రవారం నాటితో ముగిశాయి. మొతం 12 రోజులపాటు జరిగిన ఈ సమావేశాలు 61.45 గంటలపాటు కొనసాగాయి. ఈ లెక్కన సుమారు రూ.29.70 కోట్లు ఖర్చయింది. మొత్తం 11 బిల్లులు ప్రవేశపెట్టారు. అన్నీ ఆమోదం పొందాయి. అలాగే 30 స్టార్‌ప్రశ్నలు, మూడు అన్‌స్టార్‌ ప్రశ్నలు ఐదు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టారు.