మార్చి 31నుంచి దేశంలో కరోనా నిబంధనలు ఎత్తివేత

దేశంలో కరోనా వ్యాప్తి అదుపు లోకి వస్తోన్న నేపథ్యంలో కేంద్రహోం మంత్రిత్వశాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. అయితే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని పేర్కొంది. 
 
ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం అందించారు. కరోనా కట్టడి కోసం 2020 మార్చి 24 న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలు కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిల్లో మార్పులు, చేర్పులు చేసింది. 
 
అయితే గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యం లోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోం మంత్రిత్వశాఖ నిర్ణయించింది. కరోనా పరిస్థితులు మెరుగవ్వడంతో పాటు మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా తమ సామర్థాన్ని పెంచుకొని సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి.
కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇవన్నీ పరిగణన లోకి తీసుకుని నిబంధనలు మరికొంత కాలం పొడిగించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం. మార్చి 31 న ప్రస్తుతమున్న ఆంక్షల గడువు ముగియనుంది. ఆ తర్వాత హోంశాఖ ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయబోదు అని కేంద్రహోం కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
 గత కొద్ది రోజులుగా కరోనా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదవుతూ ఊరట కలిగిస్తున్నాయి. మరణాలు కూడా వంద లోపే ఉంటున్నాయి. మంగళవారం 6.77 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, 1778 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం బాధితుల సంఖ్య 23,087 కు తగ్గి పోవడంతో మొత్తం కేసుల్లో క్రియాశీల రేటు 0.05 శాతానికి క్షీణించింది.
ఇప్పటివరకు 4.30 కోట్ల మందికి కరోనా సోకగా, 4.24 కోట్ల మంది (98.75 శాతం) మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 62 మంది మృతి చెందగా, మొత్తం మరణాలు 5.16 లక్షలు దాటాయి. ఇక మంగళవారం 30.5 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు 181 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయినట్టు కేంద్రం వెల్లడించింది.