సికింద్రాబాద్‎ అగ్నిప్రమాదం 11 మంది కార్మికులు సజీవ దహనం

 
సికింద్రాబాద్‎లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బోయిగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్‎తో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గోదాంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే.. ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్న 11 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. 
 
ప్రమాదం నుంచి ఒక కార్మికుడు మాత్రమే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. మంటలు వ్యాపించిన వెంటనే స్థానికులు ఫైర్ ఇంజన్‎కు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
 
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు గోదాంలో మొత్తం 11 మంది కార్మికులు ఉన్నారు. రెస్క్యూ టీమ్ 11 మంది కార్మికుల మృతదేహాలను బయటికి తీశారు. అనంతరం మృతదేహాలను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలుగా అధికారులు చెబుతున్నారు. 
 
మృతులు బిట్టు, సికిందర్‌, దినేష్‌, దామోదర్, చింటు, సికిందర్‌, రాజేష్‌, రాజు, దీపక్‌, సత్యేందర్, పంకజ్‌గా గుర్తించారు. గోదాం యజమానిని సంపత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.
 
టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద మృతులకు సంతాపం తెలిపారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను కేసీఆర్ ప్రకటించారు. వలస కార్మికుల మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
 
ప్రధాని మోదీ సంతాపం 
 
 టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాద మృతుల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధాని  ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. 
 
ఘోర అగ్నిప్రమాదంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 11 మంది పేద కార్మికులు సజీవదహనం కావడం కలచివేసిందని తెలిపారు.   మృతులంతా బీహార్ వాసులని తెలిసిందని చెబుతూ వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
 
 మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనుమతుల నుంచి ఫైర్ సేఫ్టీ చర్యల వరకు అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం, పర్యవేక్షణాలోపమే ఇలాంటి ప్రమాదాలకు కారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావ్రుతం కాకుండా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ సూచించారు.