
ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్ -2022 టోర్నీలో మిథాలీ టీమ్ అదరగొట్టింది. ఈ మ్యాచ్ విజయంతో సెమీస్ ఆశలను సజీవం చేశారు. మంగళవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించారు.
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత బౌలర్లు రాణించారు. హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీతో రాణించిన యస్తికా భాటియా(50)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
స్మృతి మంధాన (30), షెఫాలీ వర్మ (42) రాణించినా 74 పరుగుల వద్ద భారత్ వరుసగా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రతికూల పరిస్థితుల్లో యస్తికా భాటియా హాఫ్ సెంచరీతో రాణించింది. 80 బంతులు ఎదుర్కొన్న ఆమె రెండు ఫోర్ల సహాయంతో 50 పరుగులు చేసింది. ఆమెకు రిచా ఘోష్ (26) పూజా వస్త్రాకర్ (30) సహకారం అందించారు.
అనంతరం 230 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ను భారత మహిళా బౌలర్లు 40.3 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ చేశారు. ఏ దశలోనూ బంగ్లాదేశ్ గెలిచేలా కనిపించలేదు. ఆ జట్టు బ్యాటర్లు టెస్టు మాదిరి బ్యాటింగ్ చేయడంతో రన్రేట్ క్రమంగా పెరిగిపోయింది.
భారత్ ఈనెల 27న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్లోనూ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. పాయింట్ల పట్టికలో ఆరు మ్యాచ్లలో మూడు విజయాలు సాధించి భారత్ 6 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 12 పాయింట్లు, దక్షిణాఫ్రికా 8 పాయింట్లతో తొలి రెండు స్థానాలను ఆక్రమించాయి.
బంగ్లా బౌలర్లలో రీతూ మోనీ 3, నహీదా అక్తర్ 2, జహనారా ఒకటి వికెట్లను పడగొట్టారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా అత్యధికంగా నాలుగు వికెట్లు తీసి సత్తా చాటింది. ఝులన్ గోస్వామికి రెండు, రాజేశ్వరీ గైక్వాడ్కు ఒకటి, పూజా వస్త్రాకర్కు రెండు, పూనమ్ యాదవ్కు ఒక వికెట్ దక్కాయి.
More Stories
మారిషస్ మాజీ ప్రధాని జగన్నాథ్ అరెస్ట్
అమెరికా సైన్యంలో దారి మళ్లిన ఆహార నిధులు
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట