పెగాసెస్‌పై హౌస్‌ కమిటీ …. ఏపీ అసెంబ్లీ తీర్మానం

పెగాసెస్‌పై హౌస్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ అసెంబ్లీ నిర్ణయించింది.  ఆ ,రేకు ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఏపీలో పెగాసస్ స్పైవేర్ కలకలం రేపుతోంది. టీడీపీ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశారన్న పశ్చిమ్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలలో కలకలం చెలరేగుతుంది. 
 పెగాసస్‌ స్పైవేర్‌పై జరిగిన చర్చలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ పెగాసస్‌ వంటి స్పైవేర్‌తో వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని తెలిపారు. ఇది ప్రమాదమే కాదు.. అనైతికమని కూడా అని స్పష్టం చేశారు. చంద్రబాబు పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొన్నారని సీఎం మమతా చెప్పారని గుర్తు చేస్తూ ఈ స్పైవేర్‌తో వ్యక్తిగత వివరాలన్నీ తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు.
ఇలాంటి అనైతిక కార్యక్రమాలు ఇల్లీగల్‌గానే చేస్తారని పేర్కొంటూ చంద్రబాబు చేసిన చర్య.. మానవహక్కులకు భంగం కలిగించడమే అని విమర్శించారు. పెగాసస్‌ను కొనడం ఘోరమైన నేరమని తెలుపుతూ  చంద్రబాబుకు అడ్డదారి రాజకీయాలు మాత్రమే తెలుసని ధ్వజమెత్తారు. పెగాసస్‌ను చంద్రబాబు రాజకీయనేతలపై ఉపయోగించారని ఆరోపించారు.
2016లో పెగాసస్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని గుర్తు చేస్తూ ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌ను చంద్రబాబు కొన్నారంటే ఎంత దుర్మార్గం అని తెలిపారు. పెగాసస్‌తో ఏం చేశారో  దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.  సేవామిత్ర యాప్‌ ద్వారా కూడా టీడీపీ.. ఓటర్లపై నిఘా పెట్టిందని మంత్రి బుగ్గన తెలిపారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండేవారి ఓట్లను తొలగించారని పేర్కొన్నారు.
ఆధార్‌ డేటా సేకరించి ఏ ఓటర్‌ ఏ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకునే యత్నం జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఏబీ వెంకటేశ్వరరావు ఎన్నిసార్లు ఇజ్రాయెల్‌ వెళ్లారో తనకు తెలియదని చెబుతూ  వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు, తన ఫోన్‌  ట్యాంపర్‌ అయిందని తెలిపారు.
ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి అఫిడవిట్‌ దాఖలు చేశారని చెప్పారు. ఇది రాజ్యాంగానికి విఘాతం కలిగించే చర్య అని సజ్జల అ‍న్నారని గుర్తుచేశారు.  పెగాసస్‌పై హౌస్‌కమిటీతో విచారణ జరపాలని మంత్రి బుగ్గన కోరారు.
 
పెగాసస్‌ వ్యవహారంలో తమకు సంబంధం లేదని టీడీపీ నేతలు బుకాయిస్తున్నారని వైసిపి సభ్యుడు అంబటి రాంబాబు విమర్శించారు. వాస్తవాలు లేకుండా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రకటించరు కదా? అని ప్రశ్నించారు. పెగాసస్‌ స్పైవేర్‌ అంశంపై విచారణ జరగాలని, విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.