హైదరాబాద్ ప్రెస్ క్లబ్ పాలకవర్గానికి ఆదివారం ఎన్నికలు జరుగగా ఓట్ల లెక్కింపులో తీవ్య్ర గందరగోళం జరిగింది. దానితో ఓట్ల లెక్కింపును నిలిపివేయడంతో పాటు, ఫలితాలను ప్రకటించలేదు. బాలట్ బాక్స్ లను పోలీస్ లకు అప్పగించారు. అవకతవకలు జరిగిన ఈ ఎన్నికలను రద్దు చేయాలని ప్రెస్ అకాడమీ పూర్వాధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ తిరుమలగిరి సురేంద్ర డిమాండ్ చేశారు.
అధ్యక్ష పదవికి వేసిన ఓట్ల లెక్కింపు సందర్భంగా బాలట్ పత్రంపై `స్వస్తిక్’ తో పాటు మరో `రౌండ్’ గుర్తును ఉపయోగించడంతో ఈ పదవికి పోటీచేసిన సూరజ్ భరద్వాజ్ అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఎన్నికల నిర్వహణాధికారి ఎం హేమసుందరరావు తెలిపారు. ఈ రెండు గుర్తులు వాడటం చెల్లదని, అదే జరిగిన ఓటింగ్ లో కూడా ఈ ఉన్నాడని, అందువల్ల ఎన్నికల ఫలితాలను నిలిపివేసిన్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ అంశం మీద దర్యాప్తు జరిపించి, ఈ అభ్యంతరాలు గనుక సమంజసమని తేలితే మళ్ళి తిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని హేమసుందర్ రావు సభ్యులు తెలిపారు. బ్యాలెట్ పత్రాలపై స్వస్తిక్ గుర్తును మాత్రమే పేర్కొన్నట్లు ఆయన స్పష్టం చేశారు. అందువల్లనే దర్యాప్తు జరిగేవరకు గౌరవ సభ్యులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. అప్పటి వరకు భద్రతా కారణాల వాళ్ళ బాలట్ బాక్సులను పోలీసువారికి అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.
ఇలా ఉండగా, ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టాల్సిన ప్రెస్క్లబ్ అవినీతికీ, మద్యపానానికీ, కుళ్లు రాజకీయాలకు వేదికగా మారిందని తిరుమలగిరి సురేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. రెండు దశాబ్ధాలుగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు ప్రహసనంగా మారిపోయాయని విమర్శించారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో దౌర్జన్యకాండ చోటు చేసుకోవడం అనేది క్లబ్ రాజకీయాల పతనావస్థకు పరాకాష్టగా భావించవచ్చని ధ్వజమెత్తారు.
ప్రెస్క్లబ్ ఎన్నికల్లోగతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులు ఎగబడటం, ప్రచార ఖర్చులు చూస్తుంటే వెనకాల ఏదో మతలబు ఉందా? అనే అనుమానాలు కలగడం ఒక ఎత్తయితే, ఏరకంగానూ ప్రెస్ క్లబ్ ఉన్నతికి పాటుపడని యూనియన్లు, పత్రికా సంస్థలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మరో ఎత్తని ఆయన వివరించారు.
ఇదంతా దేనికి అనే సందేహం కలుగక మానదని సురేంద్ర స్పష్టం చేశారు. లేకపోతే పత్రికల ఎడిటర్లు, బ్యూరో చీఫులు, ప్రభుత్వ సలహాదారులు, వచ్చి ఎన్నికల రోజు గేటు దగ్గర నిలబడి ఓట్లు వేయించడం దేనికి సంకేతమో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. రెండు ప్రధాన పత్రికలు ఈ ఎన్నికలలో తమ వారు తప్పనిసరిగా గెలవాలనే పట్టుదలతో ఉన్నట్లు కర్ణాకర్ణిగా తెలుస్తున్నదని సురేంద్ర ఆరోపించారు.
దీనిని ఎలా తీసుకోవాలో వస్తుంది అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రంలో క్యాబినెట్ హోదాతో పనిచేస్తున్న ఒక సీనియర్ పాత్రికేయుడు వచ్చి నిలబడి తన అభ్యర్థులను గెలిపించుకోవాలని పట్టుదలతో ర్యాంపు మీద తిరగడం మరో వైచిత్రి అని మండిపడ్డారు. ఇవన్నీ చూసేవారికి చాలా ఎబ్బెట్టుగానూ, వింతగానూ, కొండొకచో వికృతంగానూ కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో చెల్లని ఓట్ల పై అభ్యంతరాలను పట్టించుకోకపోవడం, దుండగులు బ్యాలెట్ బాక్స్ ఎత్తుకొని పోవడం, అందులో నీళ్లు పోసి తీసుకువచ్చి అప్పగించడం, లెక్కింపు పూర్తయినా ఫలితాలు ప్రకటించగలిగే పరిస్థితి ఎన్నికల అధికారులకు లేకపోవడం చూస్తుంటే అసలు ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఎందుకు జరుగుతాయి? అంటూ సురేంద్ర విస్మయం వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల వల్లన ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే ప్రశ్నలు పదేపదే తలెత్తుతాయని పేర్కొన్నారు. పైగా కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా ఆధిపత్యపోరు సాగడం ప్రెస్క్లబ్ కు ఏరకంగా సరిపడుతుంది? అని ప్రశ్నించారు.
విజ్ఞత గల సభ్యులు నిస్సహాయంగా చూస్తూ భరిస్తున్నారని అంటూ దీనిపై సహకార చట్టం కింద విచారణ జరిపించి, లోపలి వ్యవాహారాలపై లోతైన దర్యాప్తు కూడా జరిపిస్తే కొంతయినా స్పష్టత వస్తుందేమో? అని సురేంద్ర తెలిపారు. అవినీతికి, కుళ్లు రాజకీయాలకూ, కులాల కుట్రలకూ ఆలవాలమైన ప్రెస్ క్లబ్ ఎన్నికలను రద్దు చేయాలని సీనియర్ పాత్రికేయులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.
More Stories
రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం.. రాజధానిగా అమరావతి చేస్తాం
పోలింగ్కు ముందే జారిపోతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు
పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది