చైనాలో విజృంభిస్తున్న కరోనా..మరోసారి లాక్‌డౌన్

చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. గడిచిన వారం రోజుల్లోనే వెయ్యికిపైగా కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో ఉన్న చాంగ్‌చున్ పట్టణంతోపాటు, అనేక ప్రాంతాల్లో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి.
 
 దీంతో చైనా ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఒక్కరోజే 397 కరోనా కేసులు నమోదుకాగా, జిలిన్ ప్రాంతంలోనే 98 కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నాటికి కేసుల సంఖ్య 1,369కి చేరింది. 
 
చాంగ్‌చున్ పట్టణ పరిధిలో దాదాపు 90 లక్షల మంది నివసిస్తున్నారు. దీంతో చాంగ్‌చున్ సిటీ మొత్తం ప్రస్తుతం లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ మూసి ఉన్నాయి. రెండు రోజులకు ఒకసారి, ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావడానికి అనుమతిస్తున్నారు. 
 
కరోనా వైరస్‌  వెలుగు చూశాక వుహాన్‌ లాక్‌డౌన్‌ తర్వాత.. ఈ రేంజ్‌లో భారీగా లాక్‌ డౌన్‌ విధించడం ఇదే కావడం గమనార్హం. మరోవైపు కరోనా టెస్టులు కూడా విపరీతంగా చేస్తున్నారు.  గత కొన్ని రోజులుగా చైనాలో రోజువారీ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గ్వాంగ్‌ డాంగ్, జిలిన్, షాన్‌ డాంగ్ ప్రావిన్సులలో మెజారిటీ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. 
 
వింటర్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలో కట్టడి ద్వారా కేసుల్ని నియంత్రించుకోగలిగింది చైనా. అయితే జీరో కోవిడ్‌ టోలరెన్స్‌ పేరిట దారుణంగా వ్యవహరించిన దాఖలాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది.
 
 వింటర్‌ ఒలింపిక్స్‌ ఈవెంట్స్‌ ముగిశాక జనసంచారం పెరిగిపోవడంతో ఇప్పుడు కేసులు మళ్లీ పెరుగుతున్నాయి అంతే. మరోవైపు హాంకాంగ్‌లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయట‌. దీంతో ఆయా ప్రాంతాల్లో ప‌రిస్థితికి త‌గ్గ‌ట్లుగా అధికారులు ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. ఇది అసలు సంగతి.