జెలెన్‌స్కీ ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవడం లేదు

మొన్నటి వరకు ఉక్రెయిన్ ను సత్వరం స్వాధీనం చేసుకొని, కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ వచ్చినా, రెండు వారాలైనా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూ ఉండడంతో రష్యా తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. 
 
రెండు దేశాల విదేశాంగ మంత్రులు టర్కీలో సమావేశం అవుతున్న ముందు రోజున అక్కడ నెలకొన్న  వోలోడిమిర్ జెలెన్‌స్కీ నేతృత్వంలోని ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాము ప్రయత్నించడం లేదని స్పష్టం చేసింది.  రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ఈ ప్రకటన చేశారు.
అయితే,  అమెరికా సహకారంతో ఉక్రెయిన్‌లో జీవాయుధాలను తయారు చేస్తున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆమె చెప్పారు. వారానికోసారి జరిగే మీడియా సమావేశంలో ఆమె  అమెరికా రాజకీయ వ్యవహారాల శాఖ అండర్ సెక్రటరీ విక్టోరియా నూలాండ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పిన విషయాన్ని మారియా జఖరోవా ప్రస్తావించారు.
బయలాజికల్ రీసెర్చ్ కోసం ప్రయోగశాలలు ఉక్రెయిన్‌లో ఉన్నాయని నూలాండ్ ధ్రువీకరించారని చెప్పారు. శాంతియుతంగా ఉపయోగించడం గురించి కానీ, శాస్త్రీయ లక్ష్యాల గురించి కానీ తాను మాట్లాడటం లేదన్నారు. ఈ కార్యక్రమాలకు అమెరికా రక్షణ శాఖ నిధులను సమకూర్చుతోందని చెప్పారు.
 వీటి గురించి ప్రపంచానికి అమెరికా రక్షణ శాఖ, అమెరికా అధ్యక్ష పరిపాలనా యంత్రాంగం అధికారికంగా వివరించాలని ఆమె డిమాండ్ చేశారు. వివరాలను తెలియజేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ప్రపంచం కూడా అందుకు ఎదురు చూస్తోందని ఆమె  తెలిపారు. ఇదిలావుండగా, జీవాయుధాలను తయారు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ఉక్రెయిన్, అమెరికా ఖండించాయి.
ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సాధారణ ప్రజలపై రష్యా దాడులు చేస్తోందని జరుగుతున్న ప్రచారాన్ని మారియా జఖరోవ్ ఖండించారు. తాము సామాన్యులపై దాడులు చేయడం లేదని, ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడం రష్యా సైన్యం లక్ష్యం కాదని చెప్పారు.
ఉక్రెయిన్ స్వతంత్ర దేశ హోదాను నాశనం చేయాలని తాము కోరుకోవడం లేదని ఆమె తెలిపారు. ఆ దేశాన్ని డీ-నాజిఫై చేయాలని మాత్రమే కోరుకుంటున్నామని చెప్పారు.  ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియకు ఉక్రెయిన్ ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తోందని ఆమె ఆరోపించారు.
మానవతావాద కారిడార్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు కీవ్ అధికారులు చేరనివ్వడం లేదని ఆమె తెలిపారు.  కాగా,  ఉక్రెయిన్‌తో మూడు విడతల్లో జరిగిన చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోందని ఆమె చెప్పారు.
12 వేల మంది సైనికులను కోల్పోయిన రష్యా 

ఇలా ఉండగా, ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా ఇప్పటివరకు దాదాపు 12 వేల మంది సైనికులను కోల్పోయిందని ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ వెల్లడించింది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 8 వరకు జరిగిన భీకర పోరులో రష్యా వైపు 12 వేల సైనికులు మరణించగా, రష్యాకు చెందిన 303 యుద్ధ ట్యాంకులు, 1036 సాయుధ వాహనాలు, 120 శతఘ్నులు, 27 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వార్‌ఫేర్ సిస్టమ్స్, 48 యుద్ధ విమానాలు , 80 హెలికాప్టర్లు, 60 ఇంథన ట్యాంకులను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. అయితే రష్యా మాత్రం ఈ వివరాలను ఖండిస్తోంది. ఇప్పటివరకు తమవైపు కేవలం 498 సైనికులు మాత్రమే మరణించినట్టు చెబుతోంది.