హోలీ పండుగ ఈసారి మార్చి 10నే వచ్చేస్తుందని తాము చెప్పినట్టే జరిగిందని, ముందుగానే సంబరాలు చేసుకొంటున్నామని చెబుతూ ఇది ఎన్డీయే కార్యకర్తల ‘విక్టరీ 4’ (నాలుగు రాష్ట్రాల విజయం) అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. హిమాలయాల (ఉత్తరాఖండ్) నుంచి సముద్రం (గోవా) వరకూ నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని ఆశీర్వ దించారని తెలిపారు.
ఇది భారత ప్రజాస్వామ్య పండుగ అని నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయాన్ని ఉటంకిస్తూ పేర్కొన్నారు. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ఎందరో ప్రధానులను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అందించిందని, అయితే సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ తిరిగి అధికారంలోకి రావడం మాత్రం ఇదే ప్రథమమని యోగి ఆదిత్యనాథ్ విజయాన్ని మోదీ ప్రశంసించారు. దీనికి తోడు బీజేపీ ఓటింగ్ శాతం కూడా యూపీలో పెరిగిందని తెలిపారు. గోవాలో ఎగ్జిట్ పోల్స్ తప్పని మరోసారి రుజువయ్యాయని పేర్కొన్నారు. బీజేపీ మూడోసారి వరుసగా, అదికూడా మెజారిటీ సీట్లతో గెలుపొందిందని గుర్తు చేశారు.
ఉత్తరాఖండ్లో సైతం అధికారంలో ఉన్న ప్రభుత్వం తిరిగి మెజారిటీ సీట్లతో గెలవడం ఇదే మొదటి సారని ప్రధాని చెప్పారు. మణిపూర్లో కూడా ఇదే జరిగిందని పేర్కొన్నారు. హిమాలయాల (ఉత్తరాఖండ్) నుంచి సముద్రం (గోవా) వరకూ, పెద్ద రాష్ట్రమైన యూపీ నుంచి ఎక్కడో సుదూర ప్రాంతంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ వరకూ యావత్ భారతదేశ ప్రజల ఆశీస్సులను బీజేపీ అందుకొందని సంతోషం వ్యక్తం చేశారు.
బీజేపీకి విజయాన్ని చేకూరుస్తూ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొన్న వారందరికీ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. 2019లో (కేంద్రంలో) తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కొందరు ‘నిపుణులు’ 2017లో విజయమే (యూపీలో) ఇందుకు కారణమని చెప్పారని, అదే నిపుణులు ఇప్పుడు 2022 ఎన్నికల ఫలితాలే 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తారని తాను అనుకుంటున్నట్టు మోదీ పేర్కొన్నారు.
భవిష్యత్త్తులో పంజాబ్లోను మన పార్టీ జెండా ఎగురవేస్తామని మోదీ భరోసా వ్యక్తం చేశారు. కోట్ల మంది మహిళామణులు, మాతృమూర్తులే మనకు రక్షణ అని చెబుతూ తొలి సారి ఓటువేసిన యువత బిజెపికే అండగా నిలిచారని తెలిపారు. సంక్షోభ సమయంలో స్థిరమైన ప్రభుత్వానికి అండగా నిలిచాని చెబుతూ దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన సమయం ఇదని ప్రధాని పిలుపిచ్చారు. వందేళ్లలో ఎన్నడూ చూడని విపత్తును కరోనా రూపంలో చూశామని చెబుతూ మనం తీసుకున్న చర్యలవల్ల కరోనా సంక్షోభంనుంచి బయటపడ్డామని చెప్పారు.
బీజేపీ విజయోత్సవ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్షా సైతం పాల్గొని ప్రసంగించారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే రీతిలో కష్టపడతామని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య వారు పేర్కొన్నారు.
More Stories
అప్పుడు బిఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్.. తెలంగాణను లూటీ
పాక్ వద్ద అణుబాంబు… గౌరవించాల్సిందే… ఓ కాంగ్రెస్ నేత!
ఎన్డీయేలో చేరమని పవార్, ఠాక్రేలకు మోదీ ఆహ్వానం