అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని మాజీ కేంద్ర మంత్రి, బిజెపి  రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన ప్రధాని మోదీ సమర్ధ నాయకత్వంపై ప్రజల అచంచల విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. 37 ఏళ్ల తరువాత యూపీలో వరుసగా రెండవ సారి ఒకే పార్టీ అధికారంలోకి రావడం గొప్ప విషయమని చెప్పారు. 
 
ఆ ఘనత సీఎం యోగి ఆదిత్యనాధ్, ప్రధాని మోదీల సమర్థ పాలన ఫలితమేనని స్పష్టం చేశారు. కుల, వర్గ రాజకీయాలకు పాల్పడిన వారికి ఓటమి తప్పలేదని గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ ఘన విజయానికి కారకులైన నేతలు, కార్యకర్తలకు ఈ సందర్భంగా సుజనా చౌదరి అభినందనలు తెలిపారు.
 
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడంతో ఏపీలో  బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు జరిపారు. నాయకులు స్వీట్లు పంచుతూ అభినందనలు తెలుపుకున్నారు. విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, పలువురు నాయకులు సంబరాలలో పాల్గొన్నారు. 
 
రాజధాని రైతులు… సోము వీర్రాజును‌ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విజయం.. ప్రజా విజయమని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఏపీలో కూడా ఇదే రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు.